శారదా స్కాం: చిదంబరం భార్య నళినీకి సిబిఐ సమన్లు
న్యూఢిల్లీ: ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంకు మరో చిక్కు ఎదురైంది. దేశంలో సంచలనం సృష్టించిన శారాదా కుంభకోణం కేసులో చిదంబరం భార్య, చెన్నైకి చెందిన న్యాయవాది నళినికి సిబిఐ శుక్రవారం సమన్లు జారీ చేసింది.
మార్చి 10న కోల్కతాలోని సిబిఐ కార్యాలయంలో హాజరుకావాలని ఆ సమన్లలో సిబిఐ పేర్కొంది. కాగా, మొదటి సారి ఆమె పేరును ఛార్జీషీటులో పేర్కొనడం జరిగింది. 6వ సప్లిమెంటరీ ఛార్జీషీటులో సిబిఐ ఆమె పేరును ప్రస్తావించినట్లు తెలిసింది.
నళిని పేరును సాక్షిగా లేదా నిందితురాలిగా సిబిఐ పేర్కొనలేదు. వివాదాస్పద ఛానల్ ఒప్పందం గురించి సమాచారం సేకరించేందుకు సిబిఐ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆమె నుంచి దానికి సంబంధించిన సమాచారాన్ని సిబిఐ సేకరించే అవకాశం ఉంది.
కాగా, శారదా స్కాం కేసులో నిందితుడైన మనోరంజన సింగ్ తరపున న్యాయవాది అయిన నళిని వాదిస్తున్నారు. అయితే, శారదా ఖాతా నుంచే నళినికి ఫీజు చెల్లించినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. శారదా స్కాంలో ప్రధాని నిందితుడిగా వున్న సుదీప్తో సేన్ ఏప్రిల్ 2013లో సిబిఐకి రాసిన లేఖలో న్యాయవాది నళినికి ఫీజుగా శారదా ఖాతా నుంచే డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీబీఐ నళిని పేరును ఛార్జీషీటులో చేర్చింది.
జూన్ 21, 2010లో సుదీప్తో, శారదా గ్రూప్ల మధ్య ఒప్పందం కుదర్చడంలో న్యాయవాది నళిని మధ్యవర్తిగా వ్యవహరించారని సిబిఐ పేర్కొంది. న్యాయవాదిగా వారికి కావాల్సిన సేవలను నళిని అందించారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె ఎంతమొత్తం ఫీజుగా తీసుకుందో తెలుసుకోవాలనుకుంటోంది సిబిఐ. 2010-2012 మధ్య కాలంలో ఆమె రూ. 65.85 లక్షలు పొందారని విచారణాధికారులు గుర్తించారు.
కాగా, ఈ చెల్లింపునకు సంబంధించి శారదా గ్రూప్ రూ. 1.5కోట్లు టీడీఎస్గా చూపించినట్లు గుర్తించారు. సుదీప్తో సేన్... నళినికి పంపిన చాలా ఈమెయిల్స్ల గురించి సిబిఐ తెలుసుకోవాలనుకుంటోంది.