చిదంబరం వర్సెస్ అమిత్ షా.. కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఇద్దరిదీ ఒకే దారి..!
ఢిల్లీ : చిదంబరం వర్సెస్ అమిత్ షా. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర హోం మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన చిదంబరం అప్పట్లో అమిత్ షా ను టార్గెట్ చేశారనే వాదనలున్నాయి. 2005లో అప్పటి గుజరాత్ మంత్రిగా పనిచేసిన ఇప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను సీబీఐ విచారించింది. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాదాపు 60 కేసులున్న సోహ్రాబుద్దీన్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనమైంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: తీహార్ జైలుకు చిదంబరం..సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ
ఆనాడు గుజరాత్ హోం మంత్రిగా పనిచేసిన అమిత్ షా చుట్టూ ఆ కేసు తిరిగింది. అమిత్ షా ఆదేశాల మేరకే సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. అదే క్రమంలో సుప్రీం కోర్టు ఆదేశాలతో 2010, జనవరి నెలలో సీబీఐకి ఆ కేసును బదిలీ చేయడం గమనార్హం. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా చిదంబరం ఉన్నారు. ఈనాడు చిదంబరం అరెస్ట్, జైలు ఎపిసోడ్లో కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా ఉండటం గమనార్హం.
ఉద్యోగాలంటూ మోసం.. నకిలీ నోటిఫికేషన్లు.. తస్మాత్ జాగ్రత్త..!
2010 అక్టోబర్ 29వ తేదీన గుజరాత్ హైకోర్టు అమిత్ షా కు బెయిల్ మంజూరు చేసింది. అదలావుంటే 2010 నుంచి 2012 వరకు గుజరాత్లో అడుగు పెట్టకుండా ఆయన్ని బహిష్కరిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఆ సమయంలో కేంద్రంలో హోం మంత్రి హోదాలో చిదంబరం ఉండటంతో ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అయితే రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడానికి సీబీఐ వ్యవస్థను చిదంబరం దుర్వినియోగం చేశారని అప్పట్లో అమిత్ షా ఆరోపించేవారు. అదలావుంటే 2014లో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో పాగా వేయడంతో ఆ కేసు నుంచి అమిత్ షా కు ఉపశమనం లభించినట్లైంది.
ఆనాడు అమిత్ షా పై సీబీఐ అధికారులు కొరడా ఝలిపించినట్లే.. ఈనాడు చిదంబరంపై అదే సీబీఐ అధికారులు చర్యలు తీసుకున్నారు. అలా మొత్తానికి తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అమిత్ షా పై ఆనాడు చర్యలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్పై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు బీజేపీ నేతలు. ఇప్పుడు చిదంబరం అరెస్ట్ కేసులో కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీపై అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి చిదంబరం వర్సెస్ అమిత్ షా తీరుగా సాగుతున్న ఈ ఎపిసోడ్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో మరి.