ముందు ఆరోగ్యం..తర్వాతే పార్లమెంట్, చిదంబరం రాజ్యసభ హాజరుపై భార్య నళిని
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చిదంబరం బెయిల్పై విడుదలవడంపై ఆయన భార్య నళిని హర్షం వ్యక్తం చేశారు.
దుమ్ము దులుపుతారా: గురువారం పార్లమెంటుకు చిదంబరం.. ఏం మాట్లాడుతారు ?
ఆరోగ్యంపై దృష్టి..
ఐఎన్ఎక్స్ కేసులో బెయిల్పై విడుదలైన చిదంబరం తొలుత ఆరోగ్యంపై దృష్టిసారిస్తామని నళిని పేర్కొన్నారు. ఆరోగ్యం కుదుటపడ్డగా పార్లమెంట్కు హాజరవుతారని తెలిపారు. శీతకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 13వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. అంటే గురువారం కాకుండా.. ఆ లోపు చిదంబరం సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ చిదంబరం భార్య ముందు ఆరోగ్యం అని చెప్పడంతో ఆయన ఎప్పుడూ రాజ్యసభకు హాజరవుతారనే అంశంపై స్పష్టత కొరవడింది.
స్వాగతించిన కార్తీ
చిదంబరం జైలు నుంచి విడుదలవడంపై ఆయన కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ కూడా స్వాగతించారు. శివగంగ నియోజకవర్గం నుంచి చిదంబరం కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు చిదంబరం బెయిల్ను స్వాగతించారు. అతని వయస్సు 74 ఏళ్లు అని.. వయస్సురీత్యా కూడా కనికరించకుండా వేధించారని ఆరోపించారు. 105 రోజులు జైలులో ఉంచి ప్రభుత్వం టార్చర్ పెట్టిందని పేర్కొన్నారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం కడిగిన ముత్యంలా బయటకొస్తారని పేర్కొన్నారు.
105 రోజులకు..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ఆగస్ట్ 21వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ కస్టడీ పేరుతో తీహర్ జైలులో చిదంబరం ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మినరల్ వాటర్, ఇంటి ఆహారాన్ని కూడా అందజేశారు. జైలులో దోమలు కుట్టకుండా తెరలను కూడా ఏర్పాటు చేశారు.
కడుపునొప్పి అని..
చిదంబరానికి కడుపునొప్పి ఉందని అతని వైద్యులు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ హైదరాబాద్ ఏషియన్ ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంటామని కోరారు. కానీ ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు బలంగా ఉండటంతో కోర్టు చిదంబరం తరఫు న్యాయవాది వాదనలను తోసిపుచ్చారు.