కమల్హాసన్కి పద్మభూషణ్: యువీకి పద్మశ్రీ
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖ వ్యక్తులకు పద్మ అవార్డులను భారత ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. మహేల్కర్, యోగాగురు బికెఎన్ అయ్యంగార్లకు పద్మ విభూషన్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది.
24 మందికి పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 101 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు కమలహాసన్కు పద్మ భూషణ్ అవార్డును, క్రికెటర్ యువరాజ్ సింగ్కు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్కు కూడా పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తొమ్మిది మందికి పద్మ అవార్డులు లభించాయి. ఇద్దరికి పద్మభూషణ్ అవార్డులు, ఏడుగిరికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. పద్మ అవార్డులు అందుకుంటున్నవారిలో 27 మంది మహిళలు ఉన్నారు.
పుల్లెల గోపీచంద్ (క్రీడలు), స్వర్గీయ డాక్టర్ అనుమోలు రామకృష్ణ (శాస్త్ర సాంకేతిక రంగం)లను పద్మభూషణ్ అవార్డులు వరించాయి. డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ (శాస్త్ర సాంకేతిక రంగం), డాక్టర్ గోవిందన్ సుందరరాజన్ (శాస్త్ర సాంకేతిక రంగం), మహ్మద్ అలీ బేగ్ (నాటక కళారంగం), డాక్టర్ అనుమోలు రామారావు (సామాజిక సేవారంగం), నర్రా రవికుమార్ (పారిశ్రామిక, వాణిజ్యరంగం)లకు పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహిత్యవేత్త కొలుకలూరి ఇనాక్ను పద్మశ్రీ అవార్డు వరించింది. సైకతశిల్పి సదుర్శన్ పట్నాయక్ను కూడా పద్మశ్రీ అవార్డు వరించింది. సినిమా రంగానికి చెందిన విద్యాబాలన్, పరేష్ రావల్లకు కూడా పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. క్రికెటర్ అంజుమ్ చోప్రాకు కూడా పద్మశ్రీ ఆవార్డు లభించింది.