అటామిక్ సైంటిస్ట్,పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత... బలి తీసుకున్న కరోనా...
అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్,అటామిక్ సైంటిస్ట్ పద్మశ్రీ శేఖర్ బసు(68) గురువారం(సెప్టెంబర్ 24) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కోవిడ్ 19తో పాటు కిడ్నీ సమస్యలతోనూ ఆయన బాధపడుతున్నారని... ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ తెల్లవారుజామున 4.50గంటలకు కన్నుమూశారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
శేఖర్ బసు మృతిపై కేంద్ర అటామిక్ ఎనర్జీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద వార్త తనను ఎంతగానో బాధిస్తుందని చెప్పారు. మోదీ సర్కార్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు శేఖర్ బసు అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా,సెక్రటరీగా ఆయన పనిచేశారని గుర్తుచేశారు.
దేశంలో అణుశక్తి అభివృద్ధికి శేఖర్ బసు ఎంతో కృషి చేశారు. అక్టోబర్ 23,2015-సెప్టెంబర్ 17,2018 వరకు అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గానూ బాధ్యతలు నిర్వహించారు.ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారం అందించింది. 2002లో ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ అవార్డు,2006,2007లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అవార్డులు పొందారు.
దేశంలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ రూపకల్పనలో శేఖర్ బసు కీలక పాత్ర పోషించారు. దేశంలో అణువిద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు కృషిచేశారు.భారత అణుశక్తి కార్యక్రమంలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఆయన సేవలు అందించారు.
కాగా,కరోనాతో ఇటీవల పలువురు ప్రముఖులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి సురేష్ అంగడి బుధవారం(సెప్టెంబర్ 23) కరోనాతో మృతి చెందారు. అంతకుముందు కర్ణాటక బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ కూడా కరోనాతో మృతి చెందారు. ఏపీలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారినపడి కన్నుమూశారు. ఇలా వరుసగా ప్రముఖులు కరోనాకు బలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.