క్రికెట్ ఓనమాలు దిద్దించిన కోచ్ ఆధ్వర్యంలో కోహ్లీకి సన్మానం
మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం, పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కోహ్లిని తన చిన్ననాటి శిక్షణ అకాడమీ ‘పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడెమీ’ గౌరవంగా సత్కరించింది.
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడెమీ ఆదివారం ఘనంగా సత్కరించింది. మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం, పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కోహ్లిని తన చిన్ననాటి శిక్షణ అకాడమీ 'పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడెమీ' గౌరవంగా సత్కరించింది.
ఈ కార్యక్రమానికి కోహ్లీని క్రికెట్లో ఓనమాలు దిద్దించిన రాజ్కుమార్ శర్మ, భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్లతో పాటు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోహ్లీ సోదరుడు వికాస్తో పాటు తల్లి సరోజ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
విరాట్ కోహ్లీని ఢిల్లీ రంజీ జట్టులోకి తీసుకున్నప్పుడు వాసన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ కోచ్ రాజ్కుమార్ శర్మ మాట్లాడుతూ కోహ్లీలోని నైతిక విలువలు, క్రమశిక్షణ ఈరోజు ఈ స్థాయికి చేర్చేలా చేశాయని అన్నాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ గొప్ప ఆటగాడిగా రూపొందేలా చేశాయన్నాడు.
ఇక కోహ్లీ ప్రతిభను నేడు ప్రపంచం గుర్తించడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఇక ఈ సన్మాన కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ 'నేను రాజ్కుమార్ గారి వద్ద 19ఏళ్లు శిక్షణ పొందాను. నా మూలాలు అకాడమీలోనే ఉన్నాయి. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను' అని కోహ్లి పేర్కొన్నాడు.