మరికొన్ని గంటల్లో ‘పద్మావత్’ విడుదల.. ఉత్తర భారతంలో మిన్నంటిన ఆందోళన!
దేశవ్యాప్తంగా పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఆ సినిమాను బ్యాన్ చేసిన నాలుగు రాష్ట్రాలు ఆందోళనలు, హింసాత్మక చర్యలతో అట్టుడుకుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఆ సినిమాను బ్యాన్ చేసిన నాలుగు రాష్ట్రాలు ఆందోళనలు, హింసాత్మక చర్యలతో అట్టుడుకుతున్నాయి.
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన పద్మావత్ సినిమా ఆందోళన, నిరసనల నడుమ గురువారం దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందు హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.
దుకాణాల ధ్వంసం, వాహనాలకు నిప్పు...
పద్మావత్ సినిమాపై నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడుతున్నారు. వాహనాలకు నిప్పు పెడుతున్నారు. షాపులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో యూపీలోని ఇటావాలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. అటు ఢిల్లీ, జైపూర్ హైవేపై ఆందోళన చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణిసేన.. దేశవ్యాప్తంగా సినిమా విడుదలను అడ్డుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.
సినిమా విడుదలకు నో చెప్పిన డిస్ట్రిబ్యూటర్లు...
రాజస్థాన్లో ఆందోళనల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు సినిమాను విడుదల చేయడానికి వెనుకడుగు వేశారు. ఢిల్లీ, జైపూర్ హైవేతోపాటు, ఢిల్లీ, అజ్మేర్ హైవేలపై ఆందోళనకారులు రోడ్లపై టైర్లు తగలబెట్టారు. సికార్లో బస్సుపై రాళ్లు రువ్వారు. కర్ణిసేన సభ్యులు లోపలికి రావడానికి ప్రయత్నించడంతో చరిత్రలో కేవలం రెండోసారి చిత్తోరగఢ్ కోటను మూసేశారు. ముంబైలో ముందస్తు జాగ్రత్తగా 30 మంది కర్ణిసేన సభ్యులను అరెస్ట్ చేశారు. అటు అహ్మదాబాద్లోనూ 44 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి...
హర్యానాలోని గుర్గావ్లో వజీర్పూర్-పటౌడీ రోడ్డును ఆందోళనకారులు మూసేశారు. సోహ్నాలో ఓ బస్సుకు నిప్పంటించారు. ఆదివారం వరకు థియేటర్లకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ఆందోళనలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు థియేటర్ల ఓనర్లు సినిమా రిలీజ్కు నో చెప్పారు. లక్నోలోనూ రోడ్లపైకి వచ్చి సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.
వణికిపోయిన చిన్నారులు...
పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా హర్యానాలో ఆందోళనలు బుధవారం తారస్థాయికి చేరాయి. విచక్షణ మరచిన ఆందోళనకారులు స్కూల్ పిల్లల బస్సుపై దాడికి దిగారు. జీడీ గోయెంకా వరల్డ్ స్కూల్ బస్సుపై రాళ్ల దాడి చేయడంతో బస్సులోని పిల్లలు హడలిపోయారు. దాడి జరిగిన సమయంలో రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, టీచర్లు బస్సులో ఉన్నట్లు తెలిసింది. రాళ్ల దాడి నుంచి తప్పించేందుకు వారంతా సీట్లలో నుంచి లేచి బస్సు లో ఫ్లోర్పై పడుకున్నారు. ఈ సంఘటనను ఓ విద్యార్థి తన మొబైల్లో వీడియో కూడా తీశాడు. భయంతో కేకలు వేస్తున్న ఓ బాలికను టీచర్ గట్టిగా కౌగిలించుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల పోలీసులు ఉన్నా పట్టించుకోలేదని జీడీ స్కూల్ టీచర్ ఆరోపించారు.
#WATCH: Protesters torched bus and pelted stones in protest against #Padmaavat at Gurugrams' Sohna Road. #Haryana pic.twitter.com/B13t6l8XuI
— ANI (@ANI) January 24, 2018
Rajasthan: Protests staged in the area near Chittorgarh Fort in protest against #Padmaavat pic.twitter.com/Sybospb4u6
— ANI (@ANI) January 24, 2018
Ticket counter of Indra Cinemas in Jammu has been vandalized, an eyewitness says protesters raised slogans against the movie #Padmaavat pic.twitter.com/vCy5pGkaNc
— ANI (@ANI) January 24, 2018