పద్మావతి వివాదం: దేశవ్యాప్తంగా రేపు 15ని.పాటు షూటింగ్ బంద్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' చిత్రంపై నిరసనలు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మద్దతుగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది.
ది ఇండియన్ ఫిల్మ్స్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్(ఐఎఫ్టీడీఏ) సహా సినిమా, టీవీ రంగానికి చెందిన 20 అసోసియేన్లు 'పద్మావతి'కి అండగా నిలబడుతున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛకు, పద్మావతి సినిమాకు మద్దతుగా.. 15 నిమిషాల పాటు బ్లాకౌట్ నిర్వహించాలని నిర్ణయించాయి.
ఈ సందర్భంగా ఐఎఫ్టీడీఏ అధ్యక్షుడు అశోక్ పండిట్ మాట్లాడుతూ.. 'సృజనాత్మక వ్యక్తులు తమ కథను తమదైన శైలిలో చెప్పడం వారి ప్రాథమిక హక్కు. అందుకే బన్సాలీకి, 'పద్మావతి' సినిమాకి మా మద్దతు కొనసాగిస్తాం. బన్సాలీ ఓ బాధ్యతాయుతమైన చిత్ర నిర్మాణకుడు. చరిత్ర ఆధారంగా సినిమాతీయడం అంత తేలికకాదు. చాలా బాధ్యతతో కూడుకున్నది. ఆ సినిమాకు మా సంఘీభావం తెలిపేందుకు మేమంతా కలిసికట్టుగా 15 నిమిషాల పాటు బ్లాక్అవుట్ చేపట్టనున్నాం. ఈ సందర్భంగా ముంబైలోని షూటింగ్ యూనిట్స్ మొత్తం 15నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేయనున్నాయి. ఎలాంటి షూటింగ్లు జరగవు..'' అని స్పష్టం చేశారు.