‘పద్మావతి’: బ్యాన్ దిశగా రాష్ట్రాలు, చరిత్రకారులతో భేటీకి సెన్సార్ బోర్డు, దిగిపోండన్న ప్రకాశ్రాజ్
వివాదాల్లో చిక్కుకున్న ‘పద్మావతి’కి సర్టిఫికెట్ జారీ చేయడానికి ముందు చరిత్రకారులను సంప్రదిస్తామని సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి చెప్పారు. మరోవైపు బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ శాంతిభద్ర
Recommended Video
ముంబై/న్యూఢిల్లీ: పద్మావతి సినిమా వివాదాల సుడిగుండం నుండి ఇప్పుడప్పుడే బయటపడేలా కనిపించడం లేదు. సినిమాలో చరిత్రను వక్రీకరించారని ఉత్తర భారతంలోని పలు రాష్ర్టాలలో ఓవైపు ఆందోళనలు కొనసాగుతున్నాయి. చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతోపాటు సినిమాలో నటించిన వారికి హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి. హర్యానా బీజేపీ నేత సూరజ్ పాల్ అమూ.. మరో అడుగు ముందుకేసి దేశవ్యాప్తంగా ఆ సినిమా ప్రదర్శించే సినిమా థియేటర్లను తగులబెట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించేందుకు వెనుకాడలేదు.
టాలీవుడ్కు చెందిన చెందిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సినీ ప్రముఖులకు హెచ్చరికలు జారీ చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నది' అని నిలదీశారు. 'మీకు భారీ మెజారిటీ ఇచ్చాం.ఇటువంటి బెదిరింపులు ఆపలేరా? శాంతిభద్రతలు పరిరక్షించకపోతే దిగిపోండి' అని ఘాటుగా స్పందించారు. చారిత్రక ఆధారాలపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో సినిమాపై చరిత్రకారులు, నిపుణులను సంప్రదించనున్నట్లు సెన్సార్ బోర్డు తాజాగా ప్రకటించింది.
భన్సాలీపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా
మరోవైపు చిత్రం విడుదలను అడ్డుకుంటామని ప్రకటించే రాష్ట్రాల సంఖ్య కూడా పెరుగుతున్నది. సినిమాలో చరిత్రకు సంబంధించిన వక్రీకరణలను సరిదిద్దకపోతే పద్మావతిని తమ రాష్ర్టాల్లో విడుదల కానివ్వబోమని బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రకటించగా, తాజాగా మహారాష్ట్ర కూడా చేరింది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ కూడా చరిత్రను వక్రీకరిస్తే సహించబోమని అన్న సంగతి తెలిసిందే. ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ, సినిమా నటీనటులను బెదిరిస్తున్న వారిది ఎంత తప్పో, చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీది కూడా అంతే తప్పని అన్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం భన్సాలీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. చర్య అంటూ తీసుకోవాల్సి వస్తే అది రెండు వైపులా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బ తీసినందుకు భన్సాలీపైనా చర్య తీసుకోవాలన్నారు. సినిమాలోని ‘వివాదాస్పద అంశాలు' తొలిగించే వరకు చిత్రాన్ని విడుదల కానివ్వబోమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది.
థియేటర్లు తగులబెడతామని సూరజ్ పాల్ అమూ
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పద్మావతి సినిమాపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. సినిమాలు విలన్లను కీర్తించకూడదు, మతపరమైన మనోభావాలను కించపరచకూడదు, అటువంటి సినిమాలను విడుదల చేయకూడదు అని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జయకుమార్ రావల్ అన్నారు. సినిమాలో అవసరమైన మార్పులు జరిగే వరకూ విడుదల కానివ్వబోమని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే అన్నారు. బీజేపీకి చెందిన హర్యానా మీడియా సమన్వయకర్త సూరజ్పాల్ అమూ తాజాగా మరో హెచ్చరిక జారీచేశారు. దేశంలో పద్మావతి సినిమాను ఎక్కడ ప్రదర్శించినా ఆ థియేటర్ను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. భన్సాలీతోపాటు సినిమాలో పద్మావతి పాత్ర పోషించిన దీపికా పదుకునే తల నరికిన వారికి రూ.10 కోట్లు ఇస్తామని ప్రకటించినందుకు సూరజ్ పాల్ అమూపై గుర్గావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తెలంగాణలో కూడా పద్మావతి సినిమాను నిషేధించాలని కోరుతూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.
అభ్యంతరకరమైనదేదీ లేదు: భన్సాలీ
పద్మావతి సినిమాను వాస్తవిక ఘటనల ఆధారంగా రూపొందించామని చిత్ర దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ పేర్కొన్న నేపథ్యంలో, ఆ అంశాన్ని ధ్రువీకరించుకొనేందుకు సెన్సార్ బోర్డు చరిత్రకారులను సంప్రదించనున్నట్టు తెలిసింది. ఇది ఎంతో సున్నితమైన అంశమైనందున సెన్సార్ బోర్డు చరిత్రకారులను సంప్రదించనున్నదని, అందువల్ల ఆ సినిమాకు సర్టిఫికెట్ లభించడం ఆలస్యమవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పద్మావతి సినిమాకు సర్టిఫికెట్ జారీ చేసే ముందు నిపుణులను సంప్రదిస్తామని సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి ఇటీవల ఒక టీవీ చానెల్తో చెప్పారు. కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సెన్సార్ బోర్డును తన పని చేయనివ్వాలన్నారు. ‘సెన్సార్ బోర్డును ఒక పని నిమిత్తం ఏర్పాటు చేశారు. దానిని ఆ పని చేయనివ్వండి‘ అని అన్నారు. ‘పద్మావతి' సినిమాలో అభ్యంతరకరమైన అంశాలేవీ లేవని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పునరుద్ఘాటించారు. మహారాణి చేసిన త్యాగాన్ని, ఆమె ప్రదర్శించిన శౌర్యాన్ని చిత్రీకరించడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇంతకుముందు భన్సాలీ తీసిన ‘రామ్లీలా' చిత్రానికి కూడా ఇలాగే అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ఆయన అప్పుడు కూడా ఆ చిత్రం పేరును ‘గోలియో కీ రస్ లీలా: రామ్ లీలా' అని మార్చారు.
200 శాతం సినిమా పక్షమేనన్న రణబీర్ సింగ్
పద్మావతి సినిమాకు, అందులో నటించిన వారికి బెదిరింపులు ఎదురవుతుంటే కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఎందుకున్నదని జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్రాజ్ ప్రశ్నించారు. ఒక టీవీ చానెల్తో ఆయన మాట్లాడుతూ, ‘కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నది. మీకు భారీ మెజారిటీని ఇచ్చాం. ఇటువంటి బెదిరింపులు ఆపలేరా? శాంతి భద్రతలను పరిరక్షించడం చేతకాకపోతే దిగిపోండి' అని ఘాటుగా హెచ్చరించారు. పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చేపట్టడాన్ని తప్పుబట్టారు. అధికార పార్టీ బీజేపీ హర్యానా నేత సూరజ్ పాల్ అమూ ఎలా బెదిరింపులకు దిగుతారని ప్రశ్నించారు. ఇది కేవలం ‘పద్మావతి' సినిమా సమస్య కానే కాదని, దేశంలోని సినీ పరిశ్రమలన్నీ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. పద్మావతిగా నటించిన దీపికా పదుకునే తలను రక్షించాలని విలక్షణ నటుడు కమల్ హసన్ అని అన్నారు. ‘ఆమె శరీరం కన్నా తలను గౌరవించాలి. ఆమె స్వాతంత్ర్యాన్ని కాపాడాలి' అని ట్వీట్ చేశారు. మరో దర్శకుడు సుధీర్ మిశ్రా.. ఇఫీ వేడుకల వద్ద మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కు వంటిదే భావ వ్యక్తీకరణ హక్కు అని అన్నారు. సినిమాలు తీసే హక్కు తమకు ఉన్నదని, అలాగే ఎవరికైనా, ఏదైనా సమస్య ఉంటే వారు నిరసన తెలుపవచ్చునని అన్నారు. అయితే తమ భావ వ్యక్తీకరణ హక్కును తొలగించలేరని స్పష్టం చేశారు. తాను 200 శాతం సినిమాతోనే ఉన్నానని పద్మావతి నటుడు రణ్వీర్సింగ్ మరోసారి స్పష్టంచేశారు. ‘మీకేదైనా అధికారిక సమాచారం కావాలంటే సినిమా నిర్మాతలను అడగండి' అని మీడియాకు సూచించారు.ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై ఇంతకుమించి మాట్లాడబోనని పేర్కొన్నారు.