పోలీస్ స్టేషన్లో పందెం కోళ్లు వేలం, లక్ష లాభం
ఉడిపి: పోలీస్ స్టేషన్ ఆవరణంలో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఏదో గొడవలు జరిగి న్యాయం చెయ్యాలని వారు అక్కడికి వెళ్లలేదు. అక్కడ జరుగుతున్న తతంగం చూడటానికి కొందరు, వేలం పాటలో పాల్గొనేందుకు కొందరు వెళ్లారు.
ఇంతకి అక్కడ జరిగింది ఏ వేలం పాట అనుకుంటున్నారా, పందెం కోళ్ల వేలం పాట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది అక్షరాల నిజం. కర్ణాటకలోని ఉడిపి జిల్లా పడుబిద్రి పోలీస్ స్టేషన్ లో మంగళవారం రాత్రి ఈ పందెం కోళ్ల వేలం పాట రసవత్తరంగా జరిగింది.
సోమవారం సాంతూరు ప్రాంతంలో కోడి పందెం జరడంతో పోలీసులు దాడులు చేశారు. ఆ సందర్బంలో పలువురిని అరెస్టు చేసి అక్కడ ఉన్న పందెం కోళ్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. మంగళవారం ఉదయం నుండి పడుబిద్రిలో పందెం కోళ్ల వేలం ఉందని దండోరా వేయించారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పడుబిద్రి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రమేష్ స్వయంగా వేలం పాటపాడారు. భారీగా ఉన్న 35 కోళ్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఒక్కోక్క కోడి మూడు వేలకు పైగా అమ్ముడు పోయింది. రాత్రి 7 గంటల వరకు వేలం పాట జరిగింది.
వేలం పాటలో సుమారు రూ. ఒక లక్ష వచ్చిందని పోలీసులు అంటున్నారు. కోడి పందెం నిర్వహిస్తున్న 37 మందిని పోలీసులు అరెస్టు చేసి 20 వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. పందెం కోళ్లు రుచి ఎక్కువ ఉంటాయని డిమాండ్ పెరగడంతో చాలామంది ఎక్కువ ధరకు వాటిని కొనుగోలు చేశారు.