పుల్వామా దాడి... మన జవాన్ల త్యాగాలను ప్రశ్నించినవాళ్ల బాగోతం బయటపడింది...: మోదీ
పుల్వామా దాడిలో మన జవాన్ల ప్రాణత్యాగాలను ప్రశ్నించినవారి బాగోతం పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో బట్టబయలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుల్వామా దాడి సమయంలో ప్రతిపక్షాలు చేసిన దారుణ వ్యాఖ్యలు,నిందలను దేశం మరిచిపోలేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కెవాడియాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.
ముచ్చెమటలు... గజగజ వణికిపోయారు.. అభినందన్ వర్థమాన్ విడుదల వేళ ఇదీ పాకిస్తాన్ పరిస్థితి...
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పుల్వామా దాడి సమయంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను నేను భరించాను. కానీ దేశం కోసం మన సైనికులు ప్రాణత్యాగం చేయడం నా గుండెకు లోతైన గాయం చేసింది. ఇకనైనా రాజకీయ పార్టీలు జాతీయ భద్రత ప్రయోజనాల రీత్యా మన సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.' అని మోదీ పేర్కొన్నారు.పుల్వామా దాడి చుట్టూ కుట్ర కోణాలు అల్లిని కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసిన మరుసటిరోజే మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కెవాడియలో ప్రధాని మోదీ శనివారం సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించారు. దేశంలోనే తొలి వాటర్ ఏరోడ్రోమ్ ను ప్రారంభించిన ఆయన... సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు సీ ప్లేన్ లో ప్రయాణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కాగా,ఇటీవల పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా పుల్వామా దాడి తమ ఘనతే అని ప్రకటించడం తెలిసిందే. పుల్వామా మారణహోమం క్రెడిట్ నూటికి నూరు శాతం ఇమ్రాన్ సర్కారుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు పార్లమెంటులో ఆ దేశ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్పై ఆరోపణలు చేయగా... తమకేమీ సంబంధం లేదంటూ ఎన్నోసార్లు పాక్ బుకాయించింది. పైగా అంతర్జాతీయ వేదికలపై సైతం భారత్నే బద్నాం చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ దేశ మంత్రే పుల్వామా దాడి తమ ఘనత అని చెప్పుకోవడంతో పాకిస్తాన్ దుర్నీతి మరోసారి బట్టబయలైంది.
Recommended Video
ఇక పాకిస్తాన్కే చెందిన ముస్లిం లీగ్ నవాజ్ అగ్ర నేత సాధిక్ పార్లమెంటులో మాట్లాడుతూ... భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విడుదల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బజ్వా,విదేశాంగ మంత్రి ఖురేషీ గజగజ వణికిపోయారని వెల్లడించిన సంగతి తెలిసిందే. వర్థమాన్ను విడుదల చేయకపోతే భారత్ పాక్పై దాడికి దిగుతుందని ఖురేషీ పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను ఫవద్ చౌదరి ఖండించిన సంగతి తెలిసిందే.