పాక్ బోట్లో నలుగురు: ముంబై తరహా దాడులకేనా?
న్యూఢిల్లీ: ముంబై తరహా దాడులకు పాల్పడేందుకే మరపడవ ద్వారా నలుగురు ఉగ్రవాదులు సముద్ర మార్గంలో భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారనే మాట వినిపిస్తోంది. భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది, నిఘా సంస్థలు పసిగట్టి ఆ పథకాన్ని వమ్ము చేశారు. మరపడవలో భారీగా పేలుడు పదార్థాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. మరపడవలోని నలుగురు వ్యక్తులు కచ్చితంగా ఉగ్రవాదులేనని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు అంటున్నాయి.
భారత కోస్ట్ గార్డులు అడ్డగించడంతో నలుగురు వ్యక్తులు కూడా మరపడవకు నిప్పంటించి, ఆత్మాహుతికి పాల్పడ్డారని భావిస్తున్నారు. సాక్ష్యాలు లేకుండా చేయడమే అందుకు కారణమని అంటున్నారు. పాకిస్తాన్ నుంచి బయలుదేరిన మరపడవను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది జనవరి 1వ తేదీన తెల్లవారు జామున అడ్డగించి, దాడిని తిప్పికొట్టారనే మాట వినిపిస్తోంది.
కోస్ట్ గార్డ్స్ వార్నింగ్ షాట్స్ జరిపినప్పటికీ మరపడవను ఆపలేదు. కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని పట్టుకునే స్థితిలో వారు మరపడవను పేల్చేశారు. పది కిలోమీటర్ల మేర భారత జలాల్లోకి ఆ పడవ వచ్చింది. నలుగురు వ్యక్తులు కూడా మరపడవలో కరాచీ నుంచి బయలుదేరారని వారి ఫోన్ కాల్స్ను బట్టి అర్థమవుతోందని చెబుతున్నారు. కరాచీలోని సూత్రధారులతో వారు మాట్లాడడాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు.
మరపడవలోని వ్యక్తులకు లొంగిపోవడానికి అవకాశం ఉంది. లైట్లు లేకుండా ఆ మరపడవ సముద్ర జలాల్లో కనిపించింది. దాంతో భారత కోస్ట్ గార్డ్స్ అనుమానించి వెంబడించారు. లైట్లు వేయాలని భారత కోస్ట్ గార్డులు హెచ్చరించినా వినకుండా పారిపోవడానికి ప్రయత్నించారు. దాదాపు గంట పాటు ఆ పడవను భారత కోస్ట్ గార్డులు వెంబడించారు.
సాక్ష్యాలు లేకుండా చేయాలనే సూచనల కారణంగానే నలుగురు కూడా ఆత్మాహుతికి పాల్పడడమే కాకుండా మరపడవను కాల్చేశారని అంటున్నారు. సురక్షితంగా పాకిస్తాన్కు తిరిగి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతోనే ఆ పనికి పాల్పడినట్లు చెబుతున్నారు. 2014 నవంబర్లో నిఘా వర్గాలు మొదటి సారి హెచ్చరించాయి. కోల్కతా ఓడరేవుపై ఉగ్రవాద దాడి జరగవచ్చునని సమాచారం అందించాయి. భారత ఓడరేలవులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడానికి చిన్నపాటి పడవలను వాడే అవకాశం ఉందని కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో అన్ని భారత ఓడరేవుల వద్ద భద్రతను పెంచారు.
భారత నిఘా సంస్థలు నవంబర్లో మరోసారి అప్రమత్తం చేశాయి. పాకిస్తాన్ నావికా విభాగం సముద్ర మార్గంలో భారత్పై దాడి చేయడానికి లష్కరే తోయిబా సభ్యులకు సహకరిస్తున్నట్లు భారత నిఘా సంస్థల హెచ్చరికల సారాంశం. పాకిస్తాన్ నావికా విభాగం మాజీ అధికారులు లష్కరే తోయిబా సభ్యులకు శిక్షణ ఇచ్చినట్లు కూడా చెప్పాయి. 26/11తరహా దాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు చెప్పాయి.