సరిహద్దుల్లో బంకర్ల నిర్మాణం... మిలటరీని బలోపేతం చేస్తున్న పాక్
గుజరాత్ : పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 1999లో అంటే కచ్చితంగా 20 ఏళ్ల క్రితం కార్గిల్ యుద్ధం ప్రారంభానికి ముందు స్కర్దు ప్రాంతంలో బంకర్లను నిర్మించింది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుండటంతో పాకిస్తాన్ మళ్లీ బంకర్లను నిర్మించే పనిలో పడింది. జమ్మూ కశ్మీర్లోని కార్గిల్కు ఎదురుగా ఈ బంకర్ల నిర్మాణంను చేపట్టింది పాకిస్తాన్. లైన్ ఆఫ్ కంట్రోల్కు దగ్గరగా ఈ నిర్మాణం జరుగుతుండటం విశేషం.
బంకర్లు నిర్మాణం చేపట్టిన పాక్
బంకర్ల నిర్మాణం 10*12 అడుగులు ఉండగా మరికొన్ని బంకర్లు 20*12 అడుగుల మేరా నిర్మాణం చేపడుతున్నట్లు సమాచారం. ఇక ఇందులో ఆరు బంకర్లు లైన్ ఆఫ్ కంట్రోల్కు సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బంకర్లను కమాండ్ పోస్టులుగా లేదా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచేందుకు పాక్ వినియోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఒక్క జమ్మూ కశ్మీర్కు మాత్రమే ఈ బంకర్ల నిర్మాణం పరిమితం కాలేదు. సర్ క్రీక్ ప్రాంతంలో మిలటరీ బిల్డప్ను పాక్ ఏర్పాటు చేస్తున్న విషయం వెలుగు చూసింది.
సముద్ర తీరం వెంబడి మిలటరీ బలోపేతం
ఇది రెండవ బెటాలియన్ అని దీన్ని 32వ క్రీక్ బెటాలియన్గా పిలుస్తారని తెలుస్తోంది. హజ్మోరా తీరం నుంచి కరాచీ సమీపంలోని కరాంగో తీరం వరకు కార్యకలాపాలకు ఇది హెడ్క్వార్టర్స్గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే సుజ్జవాల్ దగ్గర 31వ బెటాలియన్ ఉంది. ఇక 32వ బెటాలియన్కు హెడ్క్వార్టర్స్గా గారో వ్యవహరిస్తుంది. ఇక సముద్రతీరం వెంబడి పాకిస్తాన్ తన బలగాలను బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతోందని సమాచారం. ఇప్పటి వరకు రెండు బ్రిగేడ్లు మాత్రమే ఉండేవని ఇప్పుడు ఆ సంఖ్యను 9కి చేర్చినట్లు తెలుస్తోంది.
సముద్ర మార్గం ద్వారా దాడులకు ప్లాన్..?
ఇక పాకిస్తాన్ సముద్రమార్గం ద్వారా భారత్పై దాడులు చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆరు హోవర్ క్రాఫ్ట్లను సిద్ధం చేసింది. అంతేకాదు యుద్ధ విమానాలను కూడా బలోపేతం చేసుకుంటోంది. అదే సమయంలో రాడార్ నియంత్రణ కలిగి ఉన్న తుపాకులను, స్వల్ప లక్ష్యాలను చేధించగల క్షిపణులను, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకునే పనిలో పాకిస్తాన్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మెహ్రాన్ కరాచీల్లో 4 లాక్హీడ్ పీ-3 ఓరియన్ ఎయిర్ క్రాఫ్ట్లు రెండు ఏటీఆర్లు మోహరించి ఉన్నట్లు సమచారం.
కార్గిల్ యుద్ధం తర్వాత మళ్లీ ఇంతకాలానికి ...
సర్ క్రీక్ ప్రాంతం కార్గిల్ యుద్ధం తర్వాత అక్కడ ఎలాంటి మిలటరీ చర్యలు జరగలేదు. తిరిగి ఇంతకాలానికి మళ్లీ సర్ క్రీక్ ప్రాంతంలో మిలటరీ బిల్డప్ను చేపట్టింది పాకిస్తాన్. కార్గిల్ యుద్ధం తర్వాత భారత బలగాలు పాకిస్తాన్కు చెందిన నేవల్ అట్లాంటిక్ సర్వేలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్ను కూల్చాయి. ఇక తాజా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం హరామి నాలా-సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ కమాండోలను మోహరించినట్లు తెలుస్తోంది. భారత్లోని గుజరాత్ పాకిస్తాన్లోని సింద్ ప్రాంతాన్ని సర్ క్రీక్ వేరు చేస్తుంది. అయితే ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దు ఎక్కడుందో రెండు దేశాలు ఇంకా తేల్చుకోలేకున్నాయి.