కాశ్మీర్ నుంచి గుజరాత్ దాకా: సరిహద్దుల్లో భారీగా ఎస్ఎస్జీ కమెండోలను మోహరింపజేసిన పాక్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఆ రాష్ట్ర సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే వస్తున్నాయి. యూరీ సెక్టార్ మొదలుకుని.. రాజౌరీ, పూంఛ్ వంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికులు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు నిర్వహిస్తున్నారు. ఈ వేడిని మరింత రాజేసేలా పాకిస్తాన్ సైనికాధికారులు మంగళవారం సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ చర్యల ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొంది.
జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ నుంచి గుజరాత్ తీర ప్రాంతంలోని సర్ క్రీక్ వరకూ పెద్ద ఎత్తున స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ఎస్జీ)కి చెందిన కమెండోలను మోహరింపజేసింది పాకిస్తాన్ సైన్యం. ఇంత పెద్ద ఎత్తున సరిహద్దు వెంబడి కమెండోలను మోహరింపజేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దీనితో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలన్నింటినీ భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైతే- ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్దంగా ఉన్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.
స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమెండోలకు జైషె మహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఎస్ఎస్జీ కమెండోల సూచనల మేరకే ఉగ్రవాదులు తమ దాడులకు వ్యూహాలు పన్నుతారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నవే. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు.. పాకిస్తాన్ సైన్యం పెద్ద సంఖ్యలో కమెండోలను మోహరింపజేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్టయింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉన్న లిపా వ్యాలీలో ఇప్పటికే జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన డజను మందికి పైగా ఆత్మాహూతి దళ సభ్యులు కాపుకాసి ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్తగా కమెండోలు కూడా సరిహద్దు పొడవునా మోహరింపజేయడం.. భారత్ లో ఆందోళనకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ఎకాఎకిన ఇంత పెద్ద సంఖ్యలో కమెండోలను సరిహద్దులకు చేర్చడం వల్ల యుద్ధ వాతావరణం ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదా భారత సరిహద్దు భద్రతా బలగాల కళ్లుగప్పి, 12 మంది జైషె మహమ్మద్ ఉగ్రవాదులను సరిహద్దులను దాటించే ప్రయత్నాలకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమౌతున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా తాము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని మనదేశ సైనికాధికారులు ప్రకటించారు.