సరిహద్దులో భారత్ కొత్త జెండా రెపరెపలు.. పాక్ కు మొదలైన వణుకు
భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అటారీ సమీపంలో ఏర్పాటు చేసిన దేశంలోనే అత్యంత ఎత్తయిన భారత దేశ త్రివర్ణ పతాకాన్ని చూసి పాకిస్తాన్ కు గుండెల్లో వణుకు మొదలయింది.
అమృత్ సర్: భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అటారీ సమీపంలో ఏర్పాటు చేసిన దేశంలోనే అత్యంత ఎత్తయిన భారత దేశ త్రివర్ణ పతాకాన్ని చూసి పాకిస్తాన్ కు గుండెల్లో వణుకు మొదలయింది.
ఈ జెండా ద్వారా భారత్ నిఘా ఏమైనా నిర్వహిస్తుందేమో అని పాకిస్తాన్ అనుమానిస్తోంది. ఈ మేరకు పాక్ భావిస్తున్నట్లు అక్కడి మీడియా పేర్కొంటోంది. ఇప్పటి వరకు జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో మన జాతీయ పతాకం ఉంది.
అయితే అంతకంటే ఎత్తయిన పోల్, పెద్ద జెండా తెలంగాణాలో ఎగరేయాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు నెక్లస్ రోడ్డులో 300 అడుగుల ఎత్తున ఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోల్ కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీ దీన్ని ఏర్పాటు చేసింది.
ఇప్పుడు దీనికంటే మరో 60 అడుగుల ఎక్కువ ఎత్తులో అమృత్ సర్ లో అటారీ సరిహద్దు వద్ద (దాదాపు 360 అడుగుల ఎత్తులో) కొత్త జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దీంతో పాకిస్తన్ లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ జెండా కోసం ఏర్పాటు చేసిన స్తంభం లాహోర్ నుంచి కూడా కనిపిస్తోందని, అందులో నిఘా కెమెరాలు పెట్టి తమ ప్రాంతంపై నిఘా ఏర్పటాు చేశారేమో అని పాకిస్తాన్ అనుమానిస్తోంది. ఈ విషయాన్ని పాక్ రేంజర్లు కూడా ఇప్పటి వరకు ఖండించలేదు.
అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని మన బీఎస్ఎఫ్ కొట్టిపారేసింది. అసలు పోల్ పై నిఘా కెమెరాలే లేవని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఒక ప్రత్యేక అనుమతి ద్వారా పంజాబ్ మంత్రి అనిల్ జోషి ఈ జెండాను ఆవిష్కరించారు. దీని తయారీ, ఏర్పాటుకు రూ.3.5 కోట్లు ఖర్చయ్యాయి.