పాక్ జోక్యం, ఆహ్మద్ పటేల్ను సిఎం చేయాలని: మోడీ
పాలంపూర్ (గుజరాత్): గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ నేతలను కాంగ్రెసు అగ్రనేతలు కలిశారని, ఆ వివరాలు కాంగ్రెసు ఇవ్వాలని ఆయన అన్నారు.
గుజరాత్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్ సర్దార్ అర్షద్ రఫీక్ సీనియర్ కాంగ్రెసు నేత అహ్మద్ పటేల్ను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారని ఆయన అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో కలిసి భారత్లో పాక్ హైకమిషనర్ సోహైల్ మహ్మూద్ను కలిశారని వార్తలు వచ్చిన నేపథ్యంలో పాకిస్థానీయులతో రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరం ఏం వచ్చిందన మోడీ ప్రశ్నించారు.
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్పై ప్రధాని మోడీ తన విమర్శల దాడిని కొనసాగించారు. పాకిస్థాన్ హైకమిషనర్తో రహస్య సమావేశాలు ఏంటంటూ ప్రశ్నించారు.
ఇటీవల మోదీనుద్దేశిస్తూ 'నీచ్ ఆద్మీ' అంటూ మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తనను అడ్డు తొలగించడానికి అయ్యర్ పాకిస్థాన్లో సుపారీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ మాజీ డిజి జోక్యం చేసుకుంటుండగా, మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాకిస్తాన్కు చెందినవాళ్లు సమావేశమవుతున్నారని ఆయన అన్నారు.
గుజరాత్లో ఇప్పటికే తొలిదశ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసందే. రెండో విడత పోలింగ్ ఈ నెల 14న జరుగుతుంది. మొత్తం 182 స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 18న వెలువడనున్నాయి.