ఉగ్రవాదాన్నిపోషించి, పాక్ బలి: షరీఫ్కి భారత్ ధీటుగా
న్యూఢిల్లీ: పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) నుంచి పాకిస్తాన్ వెంటనే వెళ్లిపోవాలని, దానిని పాకిస్తాన్ ఆక్రమించిందని భారత్ గురువారం మండిపడింది. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లేవనెత్తిన నేపథ్యంలో భారత్ ఘాటుగా స్పందించింది.
కాశ్మీర్ను నిస్సైనికం చేయాలన్న నవాజ్ షరీఫ్ డిమాండ్ను భారత్ గురువారం తోసిపుచ్చింది. అంతకన్నా ముందు పాకిస్తాన్ ఉగ్రవాదం వీడాలని సూచించింది. భారత్తో శాంతి కోసం తాను ప్రతిపాదించిన నాలుగు సూత్రాలలో భాగంగా షరీఫ్ కాశ్మీర్ను నిస్సైనికం చేయాలని నవాజ్ డిమాండ్ చేశాడు.
దానిపై భారత్ తీవ్రంగా స్పందించింది. నాలుగు సంతకాలకు ముందు తీవ్రవాదాన్ని ఆపాలని చెప్పింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో బుధవారం ప్రసంగించిన నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడమే కాకుండా ఈ సమస్యను పరిష్కరించకపోవడం ఐక్యరాజ్య సమితి వైఫల్యంగా అభివర్ణించారు.
ఈ సమస్యకు కాశ్మీర్ను నిస్సైనికం చేయడం సమాధానం కాదని, పాకిస్తాన్ను ఉగ్రవాదం లేని దేశంగా చేయడమేనని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కాక దాని విధానాలకు బలైన దేశమన్నారు. అది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశమన్నారు.
ఉగ్రవాదాన్ని ప్రధానంగా పెంచి పోషిస్తున్న దేశం పాకిస్తాన్ అని ఎందుకంటే అది తన ప్రభుత్వ విధానాల్లో ఉగ్రవాదాన్ని ఒక చట్టబద్ధమైన పరికరంగా ఉపయోగించుకుంటోందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత దౌత్యకార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీ అభిషేక్ సింగ్ అన్నారు.
పాకిస్తాన్ ప్రధానంగా ఉగ్రవాదానికి బలైన దేశమని షరీఫ్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడమనే తన విధానానికి బలైన దేశమని కౌంటర్ ఇచ్చారు. కాగా, పాక్ అస్థిరతకు అది ఉగ్రవాదులను పెంచి పోషించడమే కారణమని, పొరుగువారిని నిందించడం దానికి పరిష్కారం కాదని స్వరూప్ మరిన్ని ట్వీట్లలో అన్నారు.
షరీఫ్ పాకిస్తాన్ను పాలస్తీనాతో పోల్చడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలస్తీనియన్లు, కాశ్మీరీలు విదేశీ ఆక్రమణ కారణంగా అణచివేతకు గురవుతున్నారని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి మాట్లాడుతూ షరీఫ్ అన్నారు.
అయితే వాస్తవానికి ఆక్రమణదారు పాకిస్తానేనని అభిషేక్ సింగ్ అన్నారు. అంతేకాదు ప్రతీసారీ స్నేహహస్తాన్ని చాస్తున్నది భారతేనని, ఇప్పుడు సైతం ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణంలో అన్ని అపరిష్కృత సమస్యలపైన చర్చించడానికి భారత్ ఇప్పటికీ సిద్ధంగా ఉందన్నారు.