భారత్ ఎన్నికల ఫలితాలపై పాకిస్థాన్ ప్రజల ఆసక్తి: ప్రధానిగా వారు ఎవరిని కోరుకుంటున్నారు..?
అమృత్సర్: దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మరొకరోజు మాత్రమే సమయం మిగిలింది. గురువారం రోజున కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో తేటతెల్లం కానుంది. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వమ్యా దేశానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చాలా ఆసక్తికరంగా చూస్తున్నాయి పలు దేశాలు. దీంతో భారత దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా గళాన్ని విప్పిన పాక్ ప్రజలు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రపంచదేశాలతో పాటు దాయాది దేశం పాకిస్తాన్ కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఫలితాలతో రెండు దేశాల మధ్య కాల్పులు ఆగుతాయా అనే దానికోసం కాదు.... పాకిస్తాన్లోని చాలామంది ప్రజలకు భారత్లో బందువులున్నారు. బాలాకోట్ ఉగ్రవాద సంస్థలపై భారత్ చేసిన మెరుపు దాడులతో పాక్ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపించారు.
పాక్ మీడియా అత్యుత్సాహం
బాలాకోట్ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పాక్ ప్రజలు భారత్లో ఎన్డీయే ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా తిరిగి అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నారు. అంతేకాదు భారత్లో ఎన్నికలు జరిగితే పాకిస్తాన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. భారత్లో ప్రధానిగా ఎవరు ఉండాలంటూ అక్కడి ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తోంది. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి రాకూడదని లాహోర్కు చెందిన ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని మీడియాకు తెలిపాడు. అజియాజ్ అనే మరో వ్యక్తి మోడీ ఘనవిజయం సాధిస్తారని భారీ మెజార్టీతో ఎన్డీయే గెలిచి ప్రధానిగా తిరిగి బాధ్యతలు మోడీ చేపడతారని అన్నాడు. ఇది పాకిస్తాన్కు శుభపరిణామం అని అభిప్రాయపడ్డాడు.
మోడీ వస్తేనే చాలా బెటర్..పాక్ ఎన్ఆర్ఐల మాట
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత తిరిగి మోడీ ప్రధాని అయితే శాంతి చర్చలు జరుపుతామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని నెలల క్రితం వ్యాఖ్యానించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. ఇదిలా ఉంటే లండన్లో స్థిరపడ్డ పాక్ వ్యక్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు మోడీపై మరో అభిప్రాయం ఉందని... అయితే మోడీ భారత ప్రధానిగా తిరిగి వస్తేనే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని చెప్పాడు. అంతేకాదు పాక్ గడ్డపై ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని మోడీ ఏరిపారేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని చెబుతూనే... అదే సమయంలో ఉగ్రవాదులను తమ భూభాగంపై నుంచి పాక్ ప్రభుత్వం తరిమికొట్టేలా మోడీ ఒత్తిడి తీసుకురాగలడనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
మొత్తానికి భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్ చాలా ఆసక్తితో ఎదురు చూస్తోంది. అయితే మోడీపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ పరిస్థితి ఎలా ఉంటుందనేది మే 23న వచ్చే ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.