పాక్ వక్రబుద్ధి ... భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి కొన్ని గంటలైనా కాక ముందే కవ్వింపు చర్యలు
భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్ర మూకలను అంతమొందించింది. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రమూకలను అంతమొందించి పది గంటలైనా కాకముందే.. మళ్ళీ పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరచి భారత దళంపై కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు తెరతీసింది.పూంచ్ సెక్టార్లో జనావాసాలపై భారీగా షెల్లింగ్ నిర్వహించింది.ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు. పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
కాల్పుల ఘటనతో ఎదురుదాడికి దిగిన భారత సైన్యం పాక్ దాడులకు ధీటుగానే సమాధానం చెప్పింది. భారత బలగాలు పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టింది. ఐదు పాకిస్తాన్ పోస్ట్లను ధ్వంసం చేసింది. ఈ కాల్పుల్లో కొందరు పాక్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు మంగళవారం సర్జికల్ స్ట్రైక్ కారణనంగా పాక్ సరిహద్దు కలిగిన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
త్రివిధ దళాలకు కేంద్రం సెలవులు రద్దు చేయడంతో పాటుగా ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. పాక్ అక్రమ దాడులను తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో ఉన్న అన్ని ఆర్మీ క్యాంపులు, ఎయిర్బేస్లు అలర్ట్గా ఉండాలని భారత ఆర్మీ ఆదేశించింది. మొత్తానికి ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.