మా సిద్ధూ ఎక్కడ.. ఇమ్రాన్ ఆరా, మోడీకి మున్నాభాయ్ ఎంబీబీఎస్ స్టైల్లో కౌగిలింత.. అరుదైన దృశ్యం
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇద్దరూ క్రీడానేపథ్యం ఉన్న రాజకీయ వేత్తలు కావడం తెలిసింది. క్రికెట్ రంగంలో యుద్ధపూరిత వాతావరణంలో భారత, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచుల్లో ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు పైచేయి సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా వీరు క్రీడా రంగాన్ని వదలి రాజకీయ రంగంపై సత్తా చాటుతున్నారు. అయితే మైదానంలో ఎంత ప్రత్యర్థులైనా వాస్తవ జీవితంలో వారిద్దరి మధ్య సన్నిహిత, స్నేహపూరిత సంబంధాలు ఉన్నాయనేది పలు విషయాల్లో వ్యక్తమయ్యాయి. తాజాగా ఇమ్రాన్, సిద్ధూ మధ్య ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ కర్తార్పూర్ కారిడార్ ప్రారంభ వేడుకలో మరోసారి స్పష్టమైంది. వివరాల్లోకి వెళితే..
భారతీయ సిక్కు యాత్రికుల కోసం
గురునానక్ దేవ్ 550 జయంతి వేడుక సందర్భంగా పంజాబ్ ప్రావిన్స్లోని కర్తార్పూర్ కారిడార్ను ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. ఈ కారిడార్ ఆరంభించడం వేల్ల కర్తార్పూర్లోని సాహిబ్ గురుద్వారాను వేలాది మంది భారతీయ సిక్కు యాత్రికులు దర్శించుకొనే వెసలుబాటు కలుగుతుంది. ఈ కారిడార్ యాత్రికులకు అందుబాటులోకి తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, పాకిస్థాన్లో జరిగిన ఈ కార్యక్రమానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ హాజరయ్యారు. ఈ వేడుకకు సిద్ధూను ముఖ్య అతిథిగా ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించడం విశేషంగా మారింది.
చారిత్రాత్మక దినంగా నవంబర్ 9వ తేదీ
చారిత్రాత్మక దినంగా పేర్కొంటున్న నవంబర్ 9 తేదీన యాత్రికుల సందర్శన కోసం వేర్వేరు ప్రదేశాల్లో కర్తార్పూర్ కారిడార్ ప్రారంభ వేడుకలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుక జరిగే వేదిక వద్ద ఇమ్రాన్ ఖాన్.. తన మిత్రుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కోసం ఆరా తీయడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను వీక్షించడం జరిగింది.
మా సిద్ధూ ఎక్కడ?
వీడియోలో ఉన్న ప్రకారం.. కర్తార్పూర్ కారిడార్ వేడుకలో ప్రధాని ఇమ్రాన్ హడావిడిగా తన పనులు పూర్తి చేసుకొంటూనే.. తన స్నేహితుడు సిద్ధూ రాకకోసం ఎదురు చూడటం కనిపించింది. తన సన్నిహితులతో మాట్లాడుతూ.. అచ్చా.. మన సిద్ధూ ఎక్కడున్నాడు (అచ్చా హమారా వో సిద్దూ కిదర్ హై).. మన సిద్దూ ఎక్కడని నేను అడుగుతున్నాను (మై కెహ్ రహ హూ హమారా సిద్ధూ) అని ఆరా తీస్తూ ఆతృతను ప్రదర్శించడం అందర్నీ ఆకట్టుకొన్నది.
మోడీకి సిద్ధూ మున్నాభాయ్ హగ్
కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభ వేడుకలో పాల్గొన్న తర్వాత సిద్ధూ మాట్లాడుతూ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్రమోడీకి థ్యాంక్స్ చెప్పారు. దేశ విభజన తర్వాత తొలిసారి సరిహద్దులు చెరిగిపోయాయి. ఈ ఘనతలో నా స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్ కృషి మాటల్లో చెప్పలేం. దీనికి సహకరించిన మోడీజీకి థ్యాంక్స్. ఈ సందర్భంగా మోడీ సాహెబ్కు మున్నాభాయ్ ఎంబీబీఎస్ స్టైల్లో ఓ కౌగిలి పంపుతున్నాను అని సిద్ధూ తనదైన శైలిలో మాట్లాడారు.