సరిహద్దు ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తామంటున్న పాక్
పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోయి దాడులు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారు జామున భారత వాయుసేన భారత సరిహద్దులు దాటి పాక్లోకి ప్రవేశించి ముజఫర్ నగర్, బాలాకోట్, చకోటిలలో మెరుపు వేగంతో దాడులు చేసి తిరిగి భారత భూభాగంలోకి చేరుకుంది. మొత్తం 21 నిమిషాల్లో ఆపరేషన్ను పూర్తి చేసింది భారత వాయుసేన.
ఈ క్రమంలోనే భారత్ వ్యవహరించిన తీరుపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ మేరకు ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో జరిగిన అత్యవసర సమావేశంలో నిర్ణయించడం జరిగింది. సరిహద్దు రేఖ దాటి పాక్లోకి భారత్ ప్రవేశించడమంటే నిబంధనలను ఉల్లంఘించినట్లే అని పాక్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి మిలటరీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా కూడా హాజరైనట్లు సమాచారం. భారత్ సరిహద్దు రేఖ దాటి పాక్లోకి ప్రవేశించడంపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఐక్యరాజ్యసమితి మరియు పాక్ మిత్రదేశాల దృష్టికి తీసుకెళతామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది.
ఇదిలా ఉంటే పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా పాకిస్తాన్లో దాడులు చేసిందని పాక్ మీడియా జియో టీవీ కథనాలను ప్రసారం చేసింది. దాడుల్లో భాగంగా జైషే మహ్మద్ అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని భారత వాయుసేన ధ్వంసం చేసిందని ఈ దాడుల్లో పలువురు ప్రముఖ ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు మృతిచెందినట్లు కథనాలు ప్రసారం చేసింది.
మరోవైపు చైనా పాకిస్తాన్ను వెనకేసుకొచ్చింది. భారత్ పాక్లు నిగ్రహంతో వ్యవహరించాలని భారత్ ఉగ్రవాదంపై పోరు చేయాలంటే ప్రపంచదేశాల సహకారం తీసుకోవాలని సూచించింది. పాకిస్తాన్పై భారత్ దాడులు గురించి చైనా విదేశీ వ్యవహారాల ప్రతినిధిని ఒకరిని అడుగగా దాడులపై నివేదిక తెప్పించుకున్నట్లు ప్రతినిధి లూకాంగ్ చెప్పారు. దక్షిణాసియాకు భారత్ పాకిస్తాన్ దేశాలు రెండూ ముఖ్యమైనవే అన్న లూకాంగ్ రెండు దేశాలు ఒకరికొకరు సహకరించుకొని ముందుకెళితే శాంతి నెలకొంటుందని చెప్పారు.