కాశ్మీర్లో అల్లకల్లోలం: మీ పని చూసుకోండి.. పాక్కు భారత్ గట్టి జవాబు
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని కాల్చివేత నేపథ్యంలో కాశ్మీర్ అట్టుడుకుతోంది. అల్లర్ల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 29కి చేరింది. ఆందోళనకారులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణలు హింసకు దారితీశాయి. దాదాపు 800 మంది గాయాలపాలయ్యారు.
అల్లకల్లోలంగా కాశ్మీర్: బిక్కుబిక్కుమంటూ తెలుగువాళ్లు, నీళ్ల బాటిల్ రూ.60
వారిలో అత్యధికంగా పోలీసులే ఉన్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయోగించిన భాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్ల కారణంగా ఎంతో మంది కళ్లకు శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోందని స్థానిక ఆస్పత్రిలోని వైద్యులు తెలిపారు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. అనంతనాగ్, షోపియాన్, కుల్గాం, పుల్వామా, బారాముల్లా, సోపోర్, కుప్వారా, గందేర్బల్, బందిపొరా ప్రాంతాల్లో భద్రతాసిబ్బంది ఆంక్షలు విధించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శ్రీనగర్, బద్గాంలో కర్ఫ్యూ కొనసాగుతోంది.
నవాజ్ షరీఫ్కు భారత్ కౌంటర్
పాకిస్తాన్కు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. కాశ్మీర్లో చోటుచేసుకున్న హింస గురించి పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం వరుసగా ట్వీట్లు సంధించడంపై మాట్లాడుతూ... కాశ్మీర్ ఆందోళనలు భారత్ అంతర్గత వ్యవహారం అన్నారు. ఇందులో పాక్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఆ విషయాన్ని ఆయన సూటిగా, కాస్త కరకుగా చెప్పారు. ఇంకా బాధపడాలనుకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనపై ఆందోళన, ఆవేదన వ్యక్తం చేయాలని ఆయన పాక్కు సూచించారు. ఆందోళనలను ఎలా చల్లబరచాలో తమకు తెలుసన్నారు. తమకు పాఠాలు చెప్పే ప్రయత్నం వద్దన్నారు.
పాకిస్థాన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ ప్రతినిధి వికాశ్ స్వరూప్ పేర్కొన్నారు. పొరుగు దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం ఆ దేశానికే మంచిదని హితవు పలికారు.
పాక్ పాత్ర: జితేంద్ర
కాశ్మీర్ ఘటనల వెనుక పాకిస్తాన్ పాత్ర ఉందని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. భారత్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని, దీనిపై ఎప్పటికప్పుడు సాక్ష్యాలను తాము సమకూరుస్తున్నామన్నారు. కాశ్మీర్ సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచే అమర్నాథ్ యాత్రకు ఆటంకాలు కల్పించడం మంచిది కాదన్నారు.
కొన్ని అసాంఘిక శక్తులు: వెంకయ్య
కాశ్మీర్లో తీవ్రంగా చెలరేగుతోన్న అల్లర్లపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. కాశ్మీర్లో ఉగ్రవాదిని హతమార్చిన కారణంగానే ఆందోళనకారులు రెచ్చిపోతున్నారన్నారు. కొన్ని అసాంఘిక శక్తులు హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
కాశ్మీర్లో చిక్కుకున్న తెలుగోళ్లు: హీరోలా.. ఎవరీ 'టెర్రరిస్ట్' బుర్హాన్?
అక్కడి అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్న తెలుగు యాత్రికులు పడుతోన్న అవస్థల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తాము మాట్లాడామన్నారు.వారిని సురక్షితంగా తమ స్వస్థలాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు చెప్పారు.
రాజ్నాథ్ అమెరికా పర్యటన వాయిదా
జమ్మూ కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న దృష్ట్యా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నారు. వచ్చే వారం రాజ్నాథ్ అమెరికాలో భారత్, అమెరికా దేశాల భద్రతకు సంబంధించి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది.
కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ను భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో కశ్మీర్లో ఆందోళనలు కొనసాగుతున్న కారణంగా, జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున పలు సమావేశాలతో బిజీ షెడ్యూల్ ఉందని.. రెండు కారణాలతో అమెరికా పర్యటన వాయిదా వేసినట్లు హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. రాజ్నాథ్సింగ్ అమెరికా పర్యటన సెప్టెంబరులో ఉండవచ్చునని అంటున్నారు.