ఇమ్రాన్ సర్కారు పైత్యం: కాశ్మీర్ వేర్పాటువాద నేత గిలానీకి పాక్ అత్యున్నత పురస్కారం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. కాశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీకి అత్యున్నత గౌరవం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ యువతను ఉగ్రవాదంపై ప్రోత్సహించిన గిలానీని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'నిషాన్-ఈ-పాకిస్థాన్' అనే బిరుదుకు ఎంపిక చేసింది.
ఈ మేరకు మంగళవారం అవార్డును ప్రకటించింది. కాశ్మీర్ కల్లోలానికి ఒక కారణమైన సయ్యద్ గిలానీకి ఈ అవార్డును ప్రకటించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసి తొలి ఏడాది పూర్తి కావడానికి సరిగ్గా వారం ముందు ఈ అవార్డును ప్రకటించడం గమనార్హం.
కాగా, ఆర్టికల్ 370 రద్దు అనంతరం కాశ్మీర్లో నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో 16 పార్టీల కూటమి అయిన హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. సంస్థ సిద్ధాంతం పక్కదారి పట్టిందనీ, సభ్యుల్లో తిరుగుబాటుతనం పెరిగిపోయిందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గిలానీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Recommended Video
చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న 90ఏళ్ల గిలానీ.. గత ఏడాది కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన దగ్గర్నుంచి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. 1990లో ఉమ్మడి హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపక సభ్యుడైన గిలానీ.. 2003లో భేదాభిప్రాయాలతో మరో పార్టీ పెట్టారు. అప్పట్నుంచి గిలానీ సంస్థకు జీవితకాల ఛైర్మన్ గా వ్యవహరించారు.