‘శాల్యూట్ ఇండియా.. కృతజ్ఞతలు మోడీ’.. పాక్ సోదరీమణుల భావోద్వేగం!
దాదాపు పదేళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవించి సురక్షితంగా తమ దేశానికి వెళ్లబోతున్నందుకు పాకిస్తాన్ కు చెందిన సోదరీమణులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
అమృత్సర్: దాదాపు పదేళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవించి సురక్షితంగా తమ దేశానికి వెళ్లబోతున్నందుకు పాకిస్తాన్ కు చెందిన సోదరీమణులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
వివరాల్లోకి వెళితే.. పాక్కు చెందిన రషీదా ఆమె ఇద్దరు కుమార్తెలు ఫాతిమా, ముంతాజ్ లను 2006, మే 8న అట్టారీ అంతర్జాతీయ సరిహద్దులో భారత భద్రతా దళాలు అరెస్టు చేశాయి. అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నందుకు వారిని అరెస్టు చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష, రెండు లక్షల జరిమానా విధించారు.
అయితే.. 2008లో రషీదాను న్యాయస్థానానికి తీసుకెళ్తున్న సమయంలో ఆమె మృతి చెందింది. ఫాతిమా, ముంతాజ్లను మాత్రం అమృత్సర్లోని జైలుకు తరలించారు. జైలుకు వెళ్లే సమయంలో ఫాతిమా గర్భిణి. జైల్లోనే ఆమె హీనాకు జన్మనిచ్చింది.
ఏ తప్పు చేయకపోయినా.. ఆ చిన్నారి మాత్రం ఇన్నేళ్లుగా జైల్లోనే కాలం గడపాల్సి వచ్చింది. దీనిపై ఫాతిమా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ కేసు విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ పాప హీనాను విడుదల చేసేందుకు సహాయం చేయాల్సిందిగా ఆమె లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని మోడీ చొరవతో ఫాతిమా, ముంతాజ్ గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వాళ్లు మీడియాతో మాట్లాడారు. 'మా లేఖకు స్పందించి సహాయం చేసినందుకు ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు.. శాల్యూట్ ఇండియా..' అంటూ ఫాతిమా హర్షం వ్యక్తం చేశారు. పాక్ సోదరీమణులను భారత భద్రతా సిబ్బంది అట్టారీ సరిహద్దులో ఆ దేశ అధికారులకు అప్పగించనున్నారు.