అయోధ్య లక్ష్యంగా యూపీలో ఉగ్రదాడులకు ప్లాన్ .. ఇంటిలిజెన్స్ హెచ్చరిక.. హై అలెర్ట్ ...
అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో హై అలర్ట్ జారీ అయింది. నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో పోలీసులు అయోధ్యలో అదనపు బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దేశం మొత్తం అయోధ్య తీర్పు విషయంలో చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇంటిలిజెన్స్ హెచ్చరిక మరింత టెన్షన్ పెడుతుంది.
అయోధ్య తీర్పు దేశవ్యాప్త అలర్ట్ ...యూపికి అదనపు బలగాలు
అయోధ్య తీర్పు సమయంలో యూపీలో టెన్షన్
అయోధ్య తీర్పు దగ్గర పడుతున్న తరుణంలో, ఉత్తర ప్రదేశ్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ టెర్రర్ గ్రూపులపై సమాచారం వెలువడిన తరువాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఏడుగురు ఉగ్రవాదులు నేపాల్ ద్వారా యూపీలోకి ప్రవేశించినట్లు నిఘా ఏజెన్సీల వర్గాలు చెప్పినట్టు సమాచారం.
ఉగ్రదాడులకు తెగబడే అవకాశం ఉందన్న పాక్ ఇంటిలిజెన్స్ వర్గాలు
ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకార, ఏడుగురు సభ్యుల బృందం ప్రధానంగా పాకిస్తాన్ నుండి ఇండియాలోకి చొరబడిందని తెలుస్తుంది. ప్రస్తుతం, ఉగ్రవాదులు అయోధ్య, ఫైజాబాద్ మరియు గోరఖ్ పూర్ లలో దాక్కున్నట్లు భావిస్తున్నారు. ఏడుగురు ఉగ్రవాదులలో ఐదుగురిని గుర్తించినట్టుగా సమాచారం సైతం ఉంది. ఉత్తర ప్రదేశ్ లో చొరబడిన వారు మొహమ్మద్ యాకుబ్, అబూ హమ్జా, మహ్మద్ షాబాజ్, నిసార్ అహ్మద్ మరియు మహ్మద్ క్వామి చౌదరి లుగా అధికారులు గుర్తించారు. వీరు అయోధ్యపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఉగ్రవాదుల చొరబాటు సమాచారం తమకు లేదన్న యూపీ డీజీపీ ఓపి సింగ్
అయోధ్య తీర్పు త్వరలో రాబోతున్న తరుణంలో అసలే దేశ సమగ్రతపై టెన్షన్ గా ఉంటె ఇప్పుడు ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇంటిలిజన్స్ దర్యాప్తు సంస్థలు ఈ అంశాలను చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయని వర్గాలు తెలిపాయి. అయితే, ఉత్తరప్రదేశ్ డిజిపి ఓపి సింగ్ అటువంటి సమాచారం రాలేదని ఖండించారు.
అప్రమత్తంగా ఉన్నాం ... భయాందోళన అవసరం లేదన్న యూపీ డీజీపీ
ఏడుగురు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారనే నిర్దిష్ట సమాచారం తమకు లేదని, వారు ఉత్తరప్రదేశ్ లోకి చొరబడే అవకాశం లేదని అంటున్నారు. అయితే నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. అయోధ్య తీర్పుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా మతతత్వ మంటలు చెలరేగితే ఎలా కంట్రోల్ చెయ్యాలి అన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. జాతీయ భద్రతా చట్టం ప్రకారం చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.ఎవరూ ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని డీజీపీ చెప్తున్నారు.