పాక్ నుంచి ఈ సారి భారత్ కు ఏమొచ్చిందంటే ?
జైసల్మేర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో కలకలం రేగింది. పాక్ నుంచి వచ్చిన డేగ (గద్ద) స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. పాక్ లో శిక్షణ పొందిన ఈ డేగను రాజస్థాన్ లోని జైసల్మేర్ లో బీఎస్ ఎఫ్ అధికారులు పట్టుకున్నారు.
అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో డేగను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది దానిని చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే డేగకు ఎలాంటింటి ట్రాన్స్ మీటర్, యాంటెనాలు కానీ లేవని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
ఈ డేగ సౌదీ షేక్ లకు సంబంధించినదై ఉంటుందని అధికారులు అన్నారు. పాకిస్థాన్ నుంచి ఈ డేగలను సౌదీ షేక్ లు తెచ్చుకుంటారని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ డేగను రాజస్థాన్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
అక్టోబర్ 2వ తేదిన పఠాన్ కోట్ సమీపంలోని బమియాల్ సెక్టార్ లోని సింబాల్ పోస్టు దగ్గర పాకిస్థాన్ నుంచి వచ్చిన పావురాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ పావురానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ ఉర్దూలో రాసిన లేఖను కట్టి పంపించారు.
ఆ లేఖను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గాలిబుడగలకు లేఖలు కట్టి పంపించి భారత్ ను హెచ్చరించారు. కాశ్మీర్ నుంచి సరఫరా అవుతున్న యాపిల్ పండ్ల మీద భారత్ కు వ్యతిరేకంగా రాసి హెచ్చరిస్తూ పంపించిన విషయం తెలిసిందే.