వితంతువులుగా చూపించారు, కంటతడి పెట్టిన సుష్మా స్వరాజ్, పాక్పై రాజ్యసభలో నిప్పులు
Recommended Video
న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో మరణశిక్ష పడి, ప్రస్తుతం పాకిస్తాన్లోని జైలులో మగ్గిపోతున్న కుల్భూషణ్ జాదవ్ను విడిపించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఉద్ఘాటించారు.
కుల్భూషణ్ వ్యవహారంపై బుధవారం పార్లమెంట్ ఉభయసభలు అట్టుడికిన సంగతి తెలిసిందే. దీనిపై సుష్మా స్వరాజ్ గురువారం పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేశారు. జాదవ్ తల్లి, భార్య పట్ల ఆ దేశాధికారులు అనుచితంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు.
కంటతడి పెట్టిన సుష్మా స్వరాజ్...
ఒప్పందానికి విరుద్ధంగా ప్రవర్తించి కుల్భూషణ్ జాదవ్ను, అతడి కుటుంబ సభ్యులను పాకిస్తాన్ అవమానపరిచిందని, జాదవ్ను చూడడానికి వెళ్లిన అతడి తల్లి, భార్యల మెడలోంచి తాళి, చేతికున్న గాజులు, చివరికి నుదిట ఉన్న బొట్టు కూడా తీయించి.. వారిని విధవలుగా మార్చి జాదవ్కు చూపించారంటూ రాజ్యసభలో సుష్మా స్వరాజ్ కంటతడి పెట్టారు.
భయాందోళనకు గురైన జాదవ్...
అందుకే జాదవ్ తన తల్లిని చూడగానే భయాందోలనలనకు గురై ‘నాన్న బాగానే ఉన్నాడు కదా..?' అని ప్రశ్నించాడని సుష్మా పేర్కొన్నారు. మానవత్వం చాటుకున్నామని ప్రకటించుకున్న పాకిస్తాన్ అధికారులు నిజానికి ఒక భయానక వాతావరణం సృష్టించారని అన్నారు.
ఆప్యాయతను కూడా అడ్డుకున్నారు...
కుల్భూషణ్ తల్లి అవంతి తమ మాతృభాష అయిన మరాఠీలో మాట్లాడబోగా పాక్ అధికారులు అనుమతించలేదని, సమావేశంలో ఉన్న ఇద్దరు అధికారులు పదే పదే అడ్డుతగిలారని సుష్మా తెలిపారు.
హక్కులు కాలరాసిన పాక్...
ఇంగ్లీషు లేదా హిందీలో మాట్లాడమని ఒత్తిడి చేశారని, అయినప్పటికీ ఆమె అలాగే మాట్లాడుతుండగా ఇంటర్కంను బంద్ చేశారని, ఈ భేటీ సందర్భంగా జాదవ్ కుటుంబ సభ్యుల హక్కులు పదేపదే కాలరాయబడ్డాయని సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
షూ కూడా తిరిగివ్వలేదు...
రెండు విమానాల్లో ప్రయాణించి కుల్భూషణ్ జాదవ్ తల్లి, భార్య పాకిస్తాన్ చేరుకున్నారని, అతడి భార్య చేతన షూలో కెమెరా లేదా రికార్డింగ్ పరికరం ఉండొచ్చనే అనుమానంతో బలవంతంగా విప్పించిన పాక్ అధికారులు తిరిగి వచ్చే సమయంలో కనీసం ఆమెకు షూ తిరిగి కూడా ఇవ్వలేదని, ఇది ఎంతో అసంబద్ధమైన చర్య అని వ్యాఖ్యానించారు.
భారత్ మనోభావాలు దెబ్బ తీసిన పాక్...
మొత్తంమీద కుల్భూషన్ జాదవ్ను చూసేందుకు అతడి తల్లి, భార్యలను అనుమతించిన వ్యవహారంలో పాక్ వ్యవహారం భారత్ మనోభావాలను పాక్ దెబ్బతీసిందని సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాక్ అధికారులు చాలా అభ్యంతరకరంగా ప్రవర్తించారని, తాము జాదవ్ కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నామని ఆమె చెప్పారు.