ప్రతీకారమేనా?: 12మంది భారత జాలర్లను బంధించిన పాక్
న్యూఢిల్లీ: అరేబియా మహాసముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన రెండు భారతీయ పడవలను, అందులోని 12 మంది జాలర్లను పాకిస్థాన్ తీర పరిరక్షణ దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. నాలుగు రోజుల క్రితం గుజరాత్ తీరంలో పాకిస్థాన్ మరపడవను భారత కోస్ట్గార్డులు నిరోధించినందుకు ప్రతీకారంగానే పాక్ దళాలు ఈ చర్య తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
మరోపక్క మిస్టరీ పడవకు సంబంధించిన ఇతర ఆధారాలను సేకరించేందుకు విస్తృత స్థాయిలో ఆదివారం కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. అసలు ఈ పడవ భారతీయ జలాల్లోకి ఎలా వచ్చింది... అందులో ఉన్న నలుగురు ఎవరు అనే విషయాన్ని నిగ్గు తేల్చాలంటే అత్యంత మౌలికమైన ఆధారాలు సేకరించాల్సి వుంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
మరో రెండు మూడు రోజుల్లో ప్రవాస భారతీయ దినోత్సవం, అలాగే గుజరాత్కు సంబంధించి పలు కీలక కార్యక్రమాలు జరగనున్న దృష్ట్యా తీర పరిరక్షక దళాలు మరింతగా నిఘాను విస్తృతం చేశాయి.
గుజరాత్ తీరం పొడవునా పెట్రోలింగ్, వైమానిక సర్వేను నిర్వహిస్తున్నాయి. వచ్చేవారం జరగనున్న ప్రవాస భారతీయ దివస్కు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు విదేశీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.