ఓవైపు బోర్డర్ టెన్షన్స్... మరోవైపు పాక్,చైనా కంటే ఆ విషయంలో వెనుకబడ్డ భారత్...
ప్రపంచంలో అణ్వాయుధాలను కలిగిన 9 దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో ఉందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(SIPRI) వెల్లడించింది. అయితే భారత్తో పాటు దాని పొరుగు దేశాలైన చైనా,పాకిస్తాన్లు అణ్వాయుధ సమాచారాన్ని దాచి పెడుతున్నాయని.. అవి చెబుతున్న లెక్కల కంటే వాటి వద్ద ఎక్కువ అణ్వాయుధాలే ఉండవచ్చునని తెలిపింది. ఏయే దేశాల్లో ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో కూడా బయటపెట్టింది. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో అణ్వాయుధ వివరాలు బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అణ్వాయుధాలు..
ప్రపంచ దేశాలలో ప్రస్తుతం చైనా, పాకిస్థాన్ ల దగ్గర భారత్ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నట్లు తేలింది. ప్రపంచంలో ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా దేశాల వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. 1966లో స్వీడన్ ప్రభుత్వం స్థాపించిన సిప్రీ.. ప్రపంచ దేశాల ఆయుధ బలాలు,అంతర్జాతీయ భద్రతను అంచనా వేస్తుంది. సిప్రీ-2020 ప్రకారం ఈ ఏడాది వరకూ ఈ దేశాలన్నింటి వద్ద కలిపి 13,400 ఆయుధాలు ఉన్నాయి.
ఎవరెవరి వద్ద ఎన్ని...
అందులో చైనా దగ్గర 320 న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా.. పాక్ దగ్గర 160, ఇండియా దగ్గర 150 ఉన్నాయని 'ఇయర్ బుక్ 2020'లో సిప్రీ తెలిపింది. పాకిస్తాన్ భారత్ కంటే ఎక్కువ అణ్వాయుధాలతో ఆరో స్థానంలో ఉండటం గమనార్హం. అత్యధికంగా రష్యా వద్ద 6375,అమెరికా వద్ద 5800 అణ్వాయుధాలు ఉన్నట్టు వెల్లడించింది. ప్రపంచ అణ్వాయుధాల్లో 90శాతం ఈ రెండు దేశాలే కలిగివున్నట్టు తెలిపింది.
గతంతో పోలిస్తే తగ్గిన సంఖ్య
అంతర్జాతీయంగా అన్ని దేశాలు అణ్వాయుధ పెంపుపై దృష్టి సారించాయని.. వాటిని ఆధునీకరించే పనిలో ఉన్నాయని పేర్కొంది. అయితే, 2019తో పోల్చితే ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గినట్లు సిప్రీ తెలిపింది. గత సంవత్సరం 13,865గా ఉన్న అణ్వాయుధ సంఖ్య ప్రస్తుతం 13,400కి చేరినట్లు వెల్లడించింది. సైన్యంపై అధికంగా ఖర్చు చేస్తున్న జాబితాలో అమెరికా,చైనా,భారత్ ముందు వరుసలో ఉన్నట్టు స్పష్టం చేసింది.
ఆ రెండింటితో అణ్వాయుధ తయారీ..
అణ్వాయుధాల్లో యురేనియం(HEU) లేదా ప్లుటోనియం ఫిసైల్ ఉపయోగిస్తారని.. పాకిస్తాన్ ముఖ్యంగా యురేనియంపై ఆధారపడుతోందని సిప్రీ తెలిపింది. అయితే ప్లుటోనియం ఉత్పత్తిని పెంచుకోవడంపై కూడా పాక్ దృష్టి సారించిందని స్పష్టం చేసింది. చైనా,రష్యా,ఫ్రాన్స్,యూకె,యూఎస్ఏ యురేనియంతో పాటు ప్లుటోనియంను కూడా న్యూక్లియర్ వెపన్స్లో ఉపయోగిస్తున్నట్టు తెలిపింది. దక్షిణాసియాలో న్యూక్లియర్ వార్హెడ్స్ను ఎక్కడా మోహరించకపోవడం మంచి పరిణామం అని పేర్కొంది. యూఎస్,యూకె,రష్యా,ఫ్రాన్స్లు మాత్రం న్యూక్లియర్ వార్ హెడ్స్ను మోహరించినట్టు తెలిపింది.
Recommended Video
పాక్,చైనా కంటే వెనుకబడ్డ భారత్..
ప్రస్తుతం భారత సరిహద్దుల్లో న్యూక్లియర్ వార్హెడ్స్ మోహరింపు ఎక్కడా లేదు. గతంలో న్యూక్లియర్ పాలసీ గురించి స్పష్టం చేసిన భారత్.. 'మాకై మేము మొదట అణ్వాయుధాలను ప్రయోగించం.' అని స్పష్టం చేసింది. అంటే,ఒకవేళ తమపై దాడులకు దిగితే ప్రతీకార దాడులు తప్పవని పరోక్షంగా వెల్లడించింది. మరోవైపు పాక్-చైనా మిత్రుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా పాక్,చైనా నుంచి నిత్యం సవాళ్లను ఎదుర్కొంటున్న భారత్ అణ్వాయుధాల విషయంలో ఆ రెండు దేశాల కంటే వెనుకంజలో ఉండటం గమనార్హం.