పాకిస్థాన్ అదుపులోకి 18 మంది భారతీయ మత్స్యకారులు
గాంధీనగర్: గుజరాత్ తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్మెన్ అసోసియేషన్ గురువారం సాయంత్రం వెల్లడించింది. భారత్కు చెందిన మూడు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
జకావూ కోస్ట్ దగ్గర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోర్ బందర్కు చెందిన జాలర్ల సంఘం అధ్యక్షులు జీవన్ జుంగి వెల్లడించారు. ఆగస్టు 15న చేపలు పట్టే కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత మత్స్యకారులను పట్టుకోవడం ఇదే తొలిసారని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, తుఫాను ప్రభావం తీవ్రతరం అవుతుందన్న సమాచారం మేరకు మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్రికా తీర ప్రాంతంలో ఏర్పడే ప్రభావం వల్ల గుజరాత్ తీరంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపారు.