భారత భద్రతా బలగాలపై పాక్ కాల్పులు: ఇద్దరు జవాన్లు మృతి
బుధవారం పాక్ సైన్యం జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లా కెరన్ సెక్టార్లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. బుధవారం పాక్ సైన్యం జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లా కెరన్ సెక్టార్లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడింది.
ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చిన మరుసటి రోజే పాక్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడడం గమనార్హం.
అంతకుముందు ఫూంచ్ సెక్టార్ వెంబడి ఉన్న గ్రామాలపై పాక్ సైన్యం మోర్టార్లతో దాడికి దిగింది. జూన్ నెలలో పాక్ దాదాపు 23 సార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడింది.
ఈ కాల్పుల ఘటనల్లో నలుగురు పౌరులు, ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడ్డారు. భారత జవాన్లపై తాజాగా జరిపిన కాల్పుల వెనుక ఉన్నది పాకిస్తాన్ అర్మీనా లేక పాకిస్తాన్ కు చెందిన బార్డర్ యాక్షన్ టీం(బాట్)నా అన్నది తెలియరాలేదు.