పాక్ దొంగ బుద్ధి: ‘ఆకృత్యాలు’ అంటూ మన ఆర్మీ డ్రెస్సులతో ఫేక్ వీడియోల ప్రచారం
న్యూఢిల్లీ: జమ్మూ-కాశ్మీర్లో పరిస్థితులపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, వీడియోలు పోస్టు చేసి భారత సైన్యం, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని పాకిస్థాన్ సైన్యం. భారత సైన్యం దారుణాలకు పాల్పడుతోందని తప్పుడు ప్రచారం చేస్తోంది.
భారత సైనికుల తరహా యూనిఫాంను ధరించిన వ్యక్తులతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు, ఆకృత్యాలకు పాల్పడుతున్నట్లు వీడియోలను చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. దీని కోసం పాకిస్థాన్ సైన్యం ఓ కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) కేంద్రంగా ఈ కుట్రలు చేస్తోంది పాకిస్థాన్. జమ్మూకాశ్మీర్లో భారత సైన్యం ఆకృత్యాలకు పాల్పడుతోందంటూ ప్రపంచాన్ని నమ్మించేందుకు ఈ దొంగ నాటకాలు ఆడుతోంది. ఈ వ్యవహారాన్ని గుర్తించిన భారత్.. పాకిస్థాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దొంగ వ్యవహారాలను ఆపేయాలని హెచ్చరించింది.
గత కొంత కాలంగా పాకిస్థాన్ ఈ దుష్టపన్నాగాన్ని అమలు చేస్తోందంటూ భారత్ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోనే ఆ ఆకృత్యాలు జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్న పాక్.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని మండిపడింది. గూగుల్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా సంస్థలు వెంటనే అలాంటి ఫేక్ వీడియోలను తొలగించాలని భారత హోంమంత్రిత్వశాఖ సూచించింది.
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రత్తిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్.. భారత్ అక్కసును వెళ్లగక్కుతోంది. ఇది భారత అంతర్గత విషయమైనప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల మద్దతు కూడ గట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎవరూ మద్దతుగా నిలవకపోవడంతో ఐక్యరాజ్యసమితినీ ఆశ్రయించింది. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుండటంతో ఇలాంటి నకిలీ వీడియోలతో దొంగ పనులు చేస్తోంది.