పాకిస్థాన్ ఎల్ఈటీ టార్గెట్ ప్రధాని నియోజక వర్గం వారణాసి, పుణ్యక్షేత్రంలో స్కెచ్ !
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి (ఉత్తరప్రదేశ్) లోక్సభ నియోజకవర్గంలో ఉగ్ర దాడులకు పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ- తోయిబా (LET)ఉగ్రవాద సంస్థ ప్లాన్ వేసిందని ఇంటిలిజెన్స్ (ఐబీ) వర్గాలు హెచ్చరించాయి. ఐబీ వర్గాల హెచ్చరికతో పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో అధికారులు అలర్ట్ అయ్యారు.
వారణాసిలో భారీ ఉగ్ర దాడికి లష్కర్-ఏ-తోయిబా ప్లాన్ వేసిందని, ఆ ప్రాంతంలో శిబిరాన్ని కూడా ఏర్పాటు చెయ్యడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ప్రధాని నరేంద్ర మోడీ నియోజక వర్గం వారణాసి కేంద్రంగా ఉగ్రదాడులు చెయ్యడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ఉగ్రవాదులు ప్రయత్నించారని ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది.
మే మొదటి, రెండవ వారంలో వారణాసిలో మకాం వేసిన ఇద్దరు ఉగ్రవాదులు దాడులు చేసేందుకు పక్కా ప్లాన్ వెయ్యాలని నిర్ణయించారని తెలిసింది. లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఉగ్రవాది ఉమర్ మాద్ని, నేపాల్ కు చెందిన మరో ఉగ్రవాది వారణాసి చేరుకుని కొన్ని రోజులు అక్కడే మకాం వేశారని, దాడులు చెయ్యడానికి అవసరమైన ఫ్లాట్ ఫాం తయారు చేసుకోవడానికి పరిసర ప్రాంతాలు పరిశీలించారని అధికారులకు సమాచారం అందిందని తెలిసింది.
పవిత్రమైన వారణాసి నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోందని, అదును చూసి దాడులు చెయ్యాలని లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారణాసి కేంద్రంగానే అనేక ముఖ్యమైన ప్రాంతాల్లో దాడులు చెయ్యడానికి కుట్ర జరుగుతోందని ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం అందిందని తెలిసింది.
పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ నియోజక వర్గం వారణాసిని టార్గెట్ చేసుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వారణాసి మీద ఇప్పటికే నిఘా వేసిన అధికారులు అనుమానితుల మీద డేగ కన్ను వేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయిన వారణాసిలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి పోలీసులు మఫ్టీలో సంచరిస్తున్నారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ నియోజక వర్గం వారణాసిని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారని వెలుగు చూసింది.