బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుంటే పాకిస్తాన్ దాడి చేస్తుంది: అసోం మంత్రి
డిస్పూర్: అసోం మంత్రి హిమంత బిస్వశర్మ ఆదివారం నోరు జారారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అధికారంలోకి రాకుంటే పాకిస్తాన్ ఆర్మీ లేదా పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు ఇండియన్ పార్లమెంటు, అసోం అసెంబ్లీ పైన దాడి చేసినా చేస్తారని వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రాకుంటే పాకిస్థాన్ ఆర్మీ లేదా ఉగ్రవాదులు ఇండియన్ పార్లమెంట్, అస్సాం అసెంబ్లీపై దాడి చేస్తారని, మోడీ లాంటి బలమైన నేత ప్రధానిగా ఉంటేనే దేశంపై ఎలాంటి దాడులు జరగకుండా మనం ప్రతిఘటించగలమని చెప్పారు. మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే మనం పాకిస్థాన్ను ఎదుర్కోలేమని, ఈ దేశానికి ఆయనలాంటి ప్రధాని అవసరం ఉందన్నారు.
పుల్వామా దాడి ఘటనపై పాకిస్థాన్కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారని ఆయన తెలిపారు. అసోంలో ఇలాంటి జాతి వ్యతిరేక శక్తులు పుట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు.
మనమంతా ఐక్యతగా లేకపోతే పాకిస్థాన్ జిందాబాద్ అనే ఇలాంటి దుష్టశక్తులు అసోంలో ఏదో ఒక రోజు విధ్వంసం సృష్టించడం ఖాయమని హెచ్చరించారు. అందుకే మన యుద్ధం అభివృద్ధి మీదే మాత్రమే కాదని, రాజకీయ గుర్తింపుతో కూడిన అభివృద్ధిపై కూడా అన్నారు. అధికారం ఒక్కరి చేతిలో ఉంటేనే మనం అభివృద్ధిపై గానీ, ఇతర శక్తులపై గానీ యుద్ధం చేయగలమన్నారు.