జాతీయ వేడుకలు: పాక ప్రధానికి మోడీ లేఖ, వేర్పాటువాది ఆలంకు ఆహ్వానం
న్యూఢిల్లీ: ఏడు సంవత్సరాల తర్వాత పాకిస్ధాన్ జాతీయ దినోత్సవ వేడుకలను ఢిల్లీలో సోమవారం నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు వేర్పాటువాద నేత మసరాత్ ఆలంకు ఆహ్వానం అందింది. ఈ మేరకు పాకిస్ధాన్ ప్రభుత్వం స్వయంగా మసరాత్ ఆలంను ఆహ్వానించింది. ఐతే ఈ వేడుకలకు హాజరయ్యేందుకు మసరాత్ ఆలం తిరస్కరించినట్లు తెలుస్తోంది.
2008లో తాలిబన్ల దాడి తర్వాత పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహించడాన్ని నిలిపివేసింది. ఢిల్లీలోని పాకిస్ధాన్ ఎంబసీలో కూడా సోమవారం ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హురియత్ కాన్ఫరెన్స్ నేత మిర్వాజ్ ఉర్ ఫరూక్తో పాటు మరో ఆరుగురు వేర్పాటువాదులు హాజరుకానున్నారు.
2008-10 మధ్య కశ్మీర్ లోయలో జరిగిన వివిధ ఆందోళనల్లో రాళ్లు విసిరిన కేసుల్లో ఆయన జైలుపాలయ్యారు. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు మరణించారు. ఈ మారణకాండకు బాధ్యుడైన మసరాత్ ఆలంను పాకిస్దానీ హై కమిషనర్ అబ్ధుల్ బాసిత్ పాక్ జాతీయ వేడుకలకు ఆహ్వానించడాన్ని అందరూ తప్పబడుతున్నారు.
ఇటీవలే వేర్పాటువాది మసరాత్ ఆలంను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసింది. మసరాత్ ఆలం విడుదలపై దేశ వ్యాప్తంగా రాజకీయ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో మసరాత్ ఆలం విడుదలపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్లు కూడా వివరణ ఇచ్చుకున్నారు.
మసరాత్ ఆలంపై 27 కేసులున్నాయని, 27 కేసుల్లో ఆలంకు బెయిల్ లభించింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం సహా పలు కేసుల్లో ఆయన నిందితుడు. వేర్పాటు వాద ఉద్యమ నేతగా, ఉగ్రవవాదులకు సహాయం చేసాడన్న ఆరోపణలున్నాయి.
పాక్ ప్రధానికి నరేంద్ర మోడీ లేఖ
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. లేఖలో షరీఫ్కు పాకిస్థాన్ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, హింస లేకుండా ప్రశాతం వాతావరణం తీసుకురావాలని కోరారు. శాంతి చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.