పండగ రోజూ బరితెగింపు: పాక్పై రాజ్నాథ్, మోడీపై ఆప్
న్యూఢిల్లీ: నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్, దీపావళి పండగ రోజున కూడా తన దుశ్చర్యలకు విరామం ఇవ్వలేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మేమెప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. ఎప్పుడు కాల్పులకు దిగినా.. పాక్ కాల్పులకు ప్రతిచర్యగానే స్పందించాం. ఇప్పటికైనా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు స్వస్తి చెప్పాల్సి ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు.
తాము శాంతిని కోరుకుంటున్నామని చెప్పారు. పాకిస్థాన్ మాత్రం తీరు మార్చుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
సైనికులు ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులో కాపలా కాస్తున్నందునే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. వారి త్యాగాలు, సేవలకు సెల్యూట్ చేస్తున్నామని మోడీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లో దీపావళి సందర్భంగా పర్యటించిన విషయం తెలిసిందే. కాగా, పాకిస్థాన్ పండగ రోజునే భారత సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. భారత సైనికులు వారి కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు.
సైనికులతో మోడీ దీపావళి వేడుకలు శుభసూచకం: ఆప్
దీపావళి పర్వదినాన్ని ప్రధాని నరేంద్ర మోడీ.. సైనికుల మధ్య జరుపుకోవడాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతించింది. శత్రుదేశాల నుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులతో మోడీ కలిసిపోయి, దీపావళి సంబరాలు జరుపుకోవడం మంచి సంప్రదాయానికి తెరతీసిందని ఆ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్లు అన్నారు. నరేంద్ర మోడీ చర్యను అందరూ స్వాగతించాల్సిందేనని కూడా వారు వ్యాఖ్యానించారు.