సౌతిండియాపై ఉగ్రదాడికి ప్లాన్: పాక్ దౌత్యవేత్తను వాంటెడ్ లిస్టులో చేర్చిన ఎన్ఐఏ, చరిత్రలో తొలిసారి
న్యూఢిల్లీ: దక్షిణ భారత రాష్ట్రాలపై ఉగ్రదాడికి కుట్రపన్నిన పాకిస్థాన్కు చెందిన ఓ దౌత్యాధికారిని 'వాంటెడ్ లిస్టు'లో చేర్చడంతో పాటు, అతని ఫోటోను విడుదల చేసింది భారత దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). అంతేగాక, అతని గురించిన సమాచారం తెలిస్తే అందించాలని ఎన్ఐఏ కోరింది.
ఇండియా ఇలా పాక్ దౌత్యాధికారి ఫోటో, పేరు విడుదల చేస్తూ.. సమాచారం కొరడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం శ్రీలంక రాజధాని కొలంబోలోని పాకిస్థాన్ హై కమిషన్లో వీసా కౌన్సిలర్గా పని చేసినర అమీర్ జుబెయిర్ సిద్ధిఖీ.. సౌత్ ఇండియాలోని సైనిక, నౌకాదళ కేంద్రాలపై దాడులకు కుట్ర పన్నారని ఎన్ఐఏ ఆరోపించింది.
చెన్నైలోని యూఎస్ కాన్సులేట్, విశాఖపట్నంలోని ఈస్టెర్న్ నావల్ కమాండ్, బెంగళూరులోని ఇజ్రాయెల్ కాన్సులేట్ లు కూడా వీరి లక్ష్యాలుగా ఉన్నాయని పేర్కొంది. అమీర్తో పాటు మరో పాకిస్థాన్ అధికారికి కూడా ఈ కుట్రలో భాగం ఉందని ఎన్ఐఏ తెలిపింది. అమీర్ పై ఫిబ్రవరిలోనే చార్జ్ షీట్ ను దాఖలు చేసిన భారత్.. అతని ఆచూకీ తెలియకపోవడంతో ఇంటర్ పోస్ సహా పలు దేశాలను ఆచూకీపై అభ్యర్థించింది.
సిద్ధిఖీతో పాటు వినీత్ అనే పేరుతో తిరిగిన పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారిని, 'బాస్ అలియాస్ షా' పేరుతో తిరిగిన మరో వ్యక్తిని కూడా వాంటెడ్ లిస్టులో చేర్చింది ఎన్ఐఏ. వీరందరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.