పాకిస్థాన్ కుట్ర..! భారత సైన్యం అలర్ట్
అహ్మదాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ప్రతీకారేచ్ఛకు దిగింది. 40 మందికి పైగా జవాన్లను పొట్టనపెట్టుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ టార్గెట్ గా రంగంలోకి దిగింది. మంగళవారం తెల్లవారుజామున బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన విరుచుకుపడింది. అయితే అది జరిగిన కొద్దిసేపటికే పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ భారత భూభాగంలోకి రావడం కలకలం రేపింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న నలియా ఎయిర్ బేస్ సమీపంలో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు దాన్ని గుర్తించిన వాయుసేన సిబ్బంది కూల్చివేశారు.
భారత సైన్యం కదలికలను తెలుసుకునే క్రమంలో పాకిస్థాన్ డ్రోన్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే అప్రమత్తంగా ఉన్న వాయుసేన సిబ్బంది.. భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడంతో కూల్చివేశారు. భారత సైన్యం దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్, పంజాబ్ లో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. గుజరాత్ లోనూ ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అనుమానస్పద వస్తువులు గానీ వ్యక్తులు గానీ కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.