సరిహద్దుల్లో పాక్ సరికొత్త కుట్ర: డ్రోన్ల ద్వారా మారణాయుధాలు తరలింపు: 26/11 తరహా దాడులు!
చండీగఢ్: పాకిస్తాన్ సరికొత్త కుట్రకు తెర తీసింది. భారత్ లో మారణ హోమాన్ని సృష్టించడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోన్న పాకిస్తాన్.. డ్రోన్ల ద్వారా మారణాయుధాలను సరిహద్దుల్లో జార విడుస్తోంది. ఇప్పటికే భారత్ లో నిద్రాణంగా (స్లీపర్ సెల్స్) ఉన్న తీవ్రవాదులకు వాటిని చేరవేయడానికి ప్రయత్నిస్తోంది. ఏకే-47 సహా కొన్ని గ్రెనేడ్లు, మరి కొన్ని తుపాకులను ఇదే తరహాలో జార విడిచినట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. పంజాబ్ లేదా పొరుగు రాష్ట్రాల్లో 26/11 ముంబై తరహా దాడులను సృష్టించడానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రకు పాకిస్తాన్ సహకరిస్తోందని పేర్కొన్నారు. మారణాయుధాల జార విడుపు అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, సరిహద్దులను కట్టుదిట్టం చేయాలని ఆయన రక్షణశాఖకు లేఖ రాశారు.
ఈ దేశానికి మైనారిటీల కంటే ఎలుకలతోనే అధిక ప్రమాదం: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
చైనాలో తయారైన డ్రోన్..
సరిహద్దుకు అవతలి వైపు పాకిస్తాన్ భూభాగం నుంచి డ్రోన్ల సహాయంతో ఎనిమిది రోజులుగా పెద్ద ఎత్తున మారణాయుధాలు సరఫరా అవుతున్నట్లు తర్న్ తరన్ పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ సరిహద్దులు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ పట్టణం. భారీ సామాగ్రిని తరలించడానికి ఉపయోగించే డ్రోన్లు ఎనిమిది రోజులుగా క్రమం తప్పకుండా సరిహద్దుల్లో చక్కర్లు కొడుతున్నాయనే విషయాన్ని కొందరు స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఈ డ్రోన్లు 10 కేజీల పేలోడ్ ను మోయగలవని అన్నారు. దీనిపై తర్న్ తరన్ పోలీసులు సరిహద్దు భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో మరోసారి సరిహద్దును దాటుకుని భారత గగనతలంపైకి చొచ్చుకు వచ్చిన డ్రోన్ ను పడగొట్టారు జవాన్లు. దీనిపై పాకిస్తాన్ కు సంబంధించిన కొన్ని గుర్తులు, సంకేతాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గుర్తులు పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఉగ్రవాద సంస్థ ఖకియస్తాన్ జిందాబాద్ ఫోర్స్ (కేజెడ్ఎఫ్)కు చెందినవిగా అనుమానిస్తున్నారు. ఇదే సంస్థకు చెందిన నలుగురిని తర్న్ తరన్ పోలీసులు కొద్దిరోజుల కిందట అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వారు ఇచ్చిన సమాచారం, స్థానికుల నుంచి అందిన సూచనల మేరకు డ్రోన్ల కోసం మాటు వేసినట్లు చెప్పారు.
ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ నుంచి మద్దతు..
ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ నుంచి తమకు సహకారం అందుతున్నట్లు ఖకియస్తాన్ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన తీవ్రవాదులు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ మధ్యలో ఈ మారణాయుధాలు గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఖలిస్తాన్ టెర్రరిస్ట్ సంస్థకు చెందిన ఆకాశ్ దీప్ అనే సభ్యుడిని పోలీసులు ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జర్మనీలో నివసిస్తోన్న ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గుర్మీత్ సింగ్ అలియాస్ బగ్గా, మరో తీవ్రవాది రంజిత్ సింగ్ నీతాతో అతనికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. వారి సూచలన మేరకే డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరిహద్దులను దాటించినట్లు తేలింది. బగ్గా పంజాబ్ కు చెందిన వాడే కావడం వల్ల సరిహద్దుల్లో ఏయే ప్రాంతాల్లో నిఘా బలహీనంగా ఉంటుందనే విషయం అతనికి తెలుసని పోలీసులు పేర్కొన్నారు.
రాజ్ నాథ్ సింగ్ దృష్టికి..
పంజాబ్ లోని సరిహద్దు గ్రామాల్లో అనుమానాస్పద స్థితిలో భారీ ఎత్తున మారణాయుధాలను కనుగొన్నారు భద్రతా బలగాలు. పాకిస్తాన్ భూభాగంపై నుంచి వాటిని పంజాబ్ సరిహద్దుల్లోకి విసిరేసినట్లు గుర్తించారు. వాటిని ఎవరి కోసం విసిరేశారనేది ఇంకా తేలాల్సి ఉంది. శక్తిమంతమైన గ్రెనేడ్లు సహా సరిహద్దు గ్రామాల్లో భారీ ఎత్తున మారణాయుధాలను దొరికిన విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. రక్షణ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. దీనిపై ఆ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు తనకు దృష్టికి వచ్చాయని, భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఆక్ష్న హామీ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలంటూ ఇదివరకే బీఎస్ఎఫ్ జవాన్లకు సూచనలు జారీ చేశామని అన్నారు.