ఇంట్రెస్టింగ్ : భారత్లో ఆశ్రయం కల్పించాల్సిందిగా పాక్ మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి
లుధియానా: ఇమ్రాన్ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్ భారత్లో తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్లో మైనార్టీ మతస్తులపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్లోని ఖైబర్ పక్తుంక్వా జిల్లాలోని రిజర్వ్ సీటు అయిన బారికోట్ నియోజకవర్గానికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా సేవలందించారు. పాకిస్తాన్లో మైనార్టీలను అత్యంత ఘోరంగా పీడిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బల్దేవ్ కుమార్ భారత్లో మూడునెలల వీసాపై వచ్చారు. ఆగష్టు 12న ఆయన భారత్కు వచ్చారు. అంతకంటే ముందు తన భార్య ఇద్దరు పిల్లలను భారత్లోని లుధియానాలో ఉన్న తమ బంధువుల ఇంటికి పంపించారు.
రాజకీయ ఆశ్రయం కల్పించండి: పాక్ మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్
మైనార్టీలపై మెజార్టీలుగా ఉన్న ముస్లింలు దాడులు అధికమవడంతో బలవంతంగా తన కుటుంబాన్ని భారత్కు పంపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు బల్దేవ్ కుమార్. ప్రస్తుతం ఖన్నాలో తన కుటుంబంతో పాటు ఉన్న బల్దేవ్ కుమార్ ఇక పాకిస్తాన్కు వెళ్లాలని లేదని స్పష్టం చేశారు. తన కుటుంబం క్షేమంగా ఉండాలంటే భారత్లోనే ఉండాలని చెప్పిన బల్దేవ్ కుమార్... తనకు రాజకీయంగా ఆశ్రయం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు. మైనార్టీలకు అండగా నిలవడంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ విఫలమయ్యారంటూ విమర్శించారు బల్దేవ్ కుమార్.
మైనార్టీలను రక్షించడంలో ఇమ్రాన్ ఖాన్ ఫెయిల్
మైనార్టీలపై మతం పేరుతో దాడులు చేస్తున్నారని ఆరోపించిన బల్దేవ్ కుమార్... ఈ దాడులు ప్రభుత్వం, ప్రభుత్వేతర ఏజెన్సీలు చేస్తున్నాయని చెప్పారు. అయితే 2018లో ఇమ్రాన్ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మైనార్టీ ప్రజల్లో కాస్త ఆశనెలకొన్నదని అయితే ఇమ్రాన్ఖాన్ మాత్రం విఫలమయ్యాడని చెప్పారు. కొత్త పాకిస్తాన్ను నిర్మిస్తానని చెప్పిన ఇమ్రాన్ఖాన్ తన మాట నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. మైనార్టీలు నివసించేందుకు పాకిస్తాన్ సురక్షితమైన ప్రాంతం కాదని చెప్పిన బల్దేవ్ కుమార్... సిక్కు పూజారీ కూతురును బలవంతంగా మతం మారేలా చేసి ఓ ముస్లిం వ్యక్తి వివాహం చేసుకున్న తీరును ప్రస్తావించారు. అక్కడ ఓ మతంకు సంబంధించిన పూజారికే గౌరవం ఇవ్వనప్పుడు ఇక ప్రజాప్రతినిధి అయిన తన మాటలను ఎవరు లెక్కబెడుతారని ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయి
ప్రధాని నరేంద్ర మోడీ తనకు రాజకీయంగా ఆశ్రయం కల్పిస్తారనే నమ్మకం విశ్వాసం తనకుందని చెప్పారు బల్దేవ్ కుమార్. పదవిలోకి వచ్చేందుకు మైనార్టీలకు కొన్ని హామీలిచ్చి వారి ఓట్లతో గెలిచిన ఇమ్రాన్ఖాన్... ఇకపై మైనార్టీల సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. హిందువుల సిక్కులపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పాక్ ప్రధానిపై ఉందని హితవు పలికారు. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్లోని హిందువులు సిక్కులపై దాడులు మరింత పెరిగాయని చెప్పారు.
36 గంటల పాటు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నబల్దేవ్ కుమార్
ఇదిలా ఉంటే బల్దేవ్ కుమార్ కేవలం 36 గంటలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి ఎమ్మెల్యే సోరన్ సింగ్ 2016లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీంతో పాకిస్తాన్ చట్టం ప్రకారం ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే మృతి చెందితే ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడుతారు. అలా సోరన్ సింగ్ మృతి తర్వాత బల్దేవ్ కుమార్ ఎమ్మెల్యేగా అయ్యారు. అయితే ఆ ఆశ కొన్ని గంటలపాటు మాత్రమే ఉన్నింది. సోరన్ సింగ్ హత్య కేసుతో తనకు సంబంధం ఉందంటూ బల్దేవ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. సోరన్ సింగ్ స్థానం పొందేందుకు బల్దేవ్ కుమారే హత్య చేయించాడని పోలీసులు ఆరోపించారు. అయితే తనను కేసులో అన్యాయంగా ఇరికించారని బల్దేవ్ కుమార్ చెప్పారు. రెండేళ్లు జైలులో ఉన్న బల్దేవ్ కుమార్... కేసులో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే బయటకొచ్చిన రెండు రోజుల్లోనే అసెంబ్లీ కాలం ముగిసింది.