బక్రీద్ వేడుకలు ప్రసారం చెయ్యరాదు: కాశ్మీరీలకు మద్దతు, రెచ్చగొట్టిన పాకిస్థాన్ ప్రభుత్వం !
న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ, ఈద్ వేడుకలు ప్రసారం చెయ్యకూడదని, కాశ్మీర్ ప్రజల కోసం ఒక్కటిగా అందరూ పోరాటం చెయ్యాలనే వార్తలు మాత్రమే ప్రసారం చెయ్యాలని రెచ్చగొడుతు పాకిస్థాన్ లోని మీడియా సంస్థలకు పాక్ ప్రభుత్వం సూచించింది. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చెయ్యడంపై అందరూ నిరసన వ్యక్తం చెయ్యాలని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది.
బక్రీద్ పండుగ సందర్బంగా ఎలాంటి ప్రత్యేక వేడుకలు నిర్వహించరాదని, వాటిని టీవీల్లో ఎక్కువగా ప్రసారం చెయ్యరాదని, కాశ్మీర్ ప్రజల కోసం మనం అందరం పోరాటం చేద్దామని పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడి మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
పాకిస్థాన్ ప్రభుత్వం సూచన మేరకు ఆదేశంలో సాధారణంగా బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. జమ్మూ, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశారని, ఇలాంటి సమయంలో మనం బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకుంటే అక్కడి ప్రజల (కాశ్మీరీలు) మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతోందని పాకిస్థాన్ ప్రభుత్వం టీవీ చానల్స్ లో ప్రకటనలు ఇచ్చింది.
ఆగస్టు 14వ తేదీ పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజు అందరూ ఏకమైన రోజు అని వేడుకలు నిర్వహించుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. మనం ఈ విధంగా కాశ్మీర్ ప్రజలకు మద్దతు ఇవ్వాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పాక్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు పిలుపునిచ్చింది.
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ను ప్రత్యేకంగా విభజించింది. భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో షాక్ కు గురైన పాకిస్థాన్ ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. పాక్ తీరును భారత్ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.