మోదీ ముందే పాకిస్తాన్కు ట్రంప్ ప్రశంస.. ట్రేడ్ డీల్పై ఊరింపు మాటలు.. ఆయుధాలు సిద్ధమని వెల్లడి..
''ఇండియాకు అవసరమైన అత్యాధునిక ఆయుధాల్ని మేం సరఫరా చేయగలం. మిస్సైళ్లు, రాకెట్లు, విమానాలు, హెలికాప్టర్లు.. సకల ఆయుధాలను అందుబాటులోకి తెస్తాం..ఇండియాతో భాగస్వామ్యాన్ని పదిలపర్చుకోవాలనే నేనిక్కడికి వచ్చాను. మహాత్ముడి ఆశ్రమాన్ని సందర్శించుకోవడం గొప్ప అనుభూతి. మంగళవారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ లోనూ మహాత్ముడికి నివాళ్లు అర్పించబోతున్నాం. మన రెండు దేశాలు రక్షణ, వాణిజ్య రంగాల్లో మరింత సహకారాత్మకంగా ముందుకెళ్లబోతున్నాం. ఈమధ్యే రెండు దేశాల సైన్యాలు మొట్టమొదటి త్రివిధ దళాల ఎక్సర్ సైజ్ చేపట్టాం''అంటూ తన రాక ఉద్దేశాన్ని వెల్లడించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.
చరిత్రాత్మక 'నమస్తే ట్రంప్'ఈవెంట్ లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారతతో వాణిజ్య ఒప్పందంపై ఎటూ తేల్చలేదు. మోదీ పాలనపై ప్రశంసలు కురిపించిన ఆయన.. అమెరికాలో తాను కూడా గొప్ప ప్రగతి సాధించినట్లు చెప్పారు. గతంలో బరాక్ ఒబామా చేసినట్లే.. డీడీఎల్ సినిమాను గుర్తుచేసి సభికుల్ని ఉత్తేజపర్చారు. సోమవారం మోతేరా స్టేడియంలో ట్రంప్ ఏం మాట్లాడారంటే..
అద్వైత సిద్ధాంతం.. అదే మన బలం..
‘‘మన రెండు దేశాల మధ్య చాలా తేడాలుండొచ్చు. కానీ మనల్ని నడిపించే సత్యం, ఆత్మ ఒక్కటే. ఇండియాలో పుట్టి గొప్ప గురువుగా ప్రపంచ ఖ్యాతి పొందారు స్వామి వివేకానంద. ప్రతి మనిషిలోనూ దైవాన్ని(అద్వైత సిద్ధాంతం) చూడగలిగినరోజే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని స్వామీజీ తెలిపారు. మన రెండు దేశాల ప్రజల్లో సహజంగా కనిపించే స్వభావం.. అన్ని విషయాల్లో దేవుణ్ని అమితంగా విశ్వసించడమే. ఎప్పుడూ స్ఫూర్తిమంతంగా ముందుకెళ్లడంలో ఇండియన్లు, అమెరికన్లు ఒకేలా అనిపిస్తారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో రెండు దేశాలు మరింత దగ్గరవుతూ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తాయనడంలో సందేహంలేదు.
రికార్డుల ఇండియా..
ఏడాదికి దాదాపు 2వేల సినిమాల్ని నిర్మించే సత్తా బాలీవుడ్ కు ఉంది. ఇక్కడి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ప్రధానంగా ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే', షోలే లాంటి సినిమాలు.. భూమ్మీద అందరిపైనా ప్రత్యేక ముద్రవేశాయి. క్రికెట్ లోనూ ప్రపంచ రారాజుగా భారత్ కొనసాగుతోంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి మెరికలు ఎందరో ఉన్నారిక్కడ. ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్ పటేల్ విగ్రహం ఇంకో రికార్డు.
Recommended Video
మతసామరస్యం విలసిల్లుతోంది..
చెడుపై మంచి విజయం సాధించినదానికి గుర్తుగా ఇక్కడ దీపావళి పండుగ జరుపుకొంటారు. ఇంకొద్దిరోజుల్లో రంగుల పండుగ హోలీ జరుపుకోబోతుండటం సంతోషం. దేశంలోని చట్టాలన్నీ వ్యక్తుల స్వేచ్ఛ, హక్కులు, సమాన గౌరవం కల్పిస్తాయి. కోట్లమంది హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు క్రిస్టియన్లు, యూదులు కలిసికట్టుగా జీవిస్తుండటం గొప్ప విషయం. 100కుపైగా భాషలు.. రెండు డజన్లకుపైగా రాష్ట్రాలతో గొప్పగా విలసుల్లుతున్నది. అమెరికాలోని భారత సంతతి ప్రజలందరూ కష్టపడేవాళ్లే. మా దేశంలో పనిచేస్తున్నవాళ్లలో చాలా మంది గుజరాత్ కు చెందినవారే. మా దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్న అందరికీ థ్యాంక్స్.
ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి..
ఇండియాతో సంబంధాలు మెరుగుపర్చుకోడానికి అమెరికా ఉవ్విళ్లూరుతోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక ప్రగతితో అమెరికా దూసుకెళుతోందిప్పుడు. నిరుద్యోగం తగ్గింది. చిన్నపరిశ్రమలకు ఊతం లభించింది. ప్రపంచంలోనే శక్తిమంతమైన సైన్యంగా మమ్మల్ని మేం మరింత మెరుగుపర్చుకుంటున్నాం. హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను భారత్ తో చేసుకోబోతుండటం సంతోషంగా ఉంది. రక్షణ రంగంలో ఇండియాకు మొదటి ప్రయారిటీ అమెరికానే ఉంటుందని ఆశిస్తున్నాం.
పాకిస్తాన్ మాకు బెస్ట్ ఫ్రెండ్..
ఇండో-ఫసిఫిక్ రీజియన్ లో శాంతి కోసం ప్రయత్నిద్దాం. ఇస్లామిక్ టెర్రరిజాన్ని కలిసికట్టుగా అణిచేద్దాం. టెర్రరిజానికి అడ్డుకట్టవేసేలా పాకిస్తాన్ తోనూ మేం చర్చలు జరుపుతున్నాం. పాక్ మంచి మిత్రదేశం కూడా. భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గాలని కోరుతున్నాం. కలిసికట్లుగా మనం రెండు దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం.
గొప్ప డీల్.. త్వరలో..
చరిత్రలో లేనంత గొప్ప వాణిజ్య ఒప్పందాలను చేసుకోబోతున్నాం. రెండేళ్ల కిందట నా కూతురు ఇవాంకను మోదీ ఆహ్వానించారు. అందుకే తాను నాతో కూడా వచ్చేసింది. స్పేస్ నుంచి చిన్న విషయాల దాకా ఇండియా- అమెరికా భాగస్వాములుగా ఉంటాయి. మోదీ నాయకత్వంలో దేశం చాలా ప్రగతి సాధించింది. ఇతర దేశాలు ఆలోచించలేనంత పెద్దగా ఇండియాను ముదుకు తీసుకెళ్లే పథకాలు మోదీ దగ్గరున్నాయి. ఈ సందర్భంగా ఇండియాలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. గాడ్ బ్లెస్ ఇండియా.. గాడ్ బ్లెస్ అమెరికా.. ''అని ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.