పాకిస్థాన్ రగిలిపోతోంది..! ఆర్టికల్ 370 రద్దుపై భారత రాయబారికి నోటీసులు..!!
శ్రీనగర్/హైదరాబాద్ : కశ్మీర్ అంశంలో భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల పాకిస్తాన్ రగిలిపోతోంది. భారత్ వ్యూహానికి ఎలాంటి ప్రతివ్యూహంతో ముందుకు వెళ్లాలో పాకిస్తాన్ కు అర్థం కాని అయోమయ పరిస్ధితులు నెలకొన్నాయి. కాని జరితున్న పరిణామాలపై మాత్రం పాక్ రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జమ్ముకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనైతికం, చట్ట వ్యతిరేకమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన ద్వారా విమర్శించింది. భారత్ నిర్ణయంపై కౌంటర్ కు సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలిస్తామని తెలిపింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రదేశం కశ్మీర్ అని... ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి కలగజేసుకోవాలని కోరింది. మరోవైపు, పాకిస్థాన్ లోని భారత రాయబారి అజయ్ బిసారియాలకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జరీ చేస్తూ, నిరసన వ్యక్తం చేసింది.
ఆర్టికల్ 370 రద్దు పట్ల పాక్ మండిపాటు..! ఇండియన్ ఎంబసీకి నోటీసులు..!!
కశ్మీరీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తోందని మండిపడింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు పాకిస్థాన్ పార్లమెంటు ఉభయసభలు అత్యవసరంగా సమావేశం కాబోతున్నాయి. జమ్ముకశ్మీర్, నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు, భారత్ నిర్ణయాలపై మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ లో మాట్లాడారు. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారికి ఇమ్రాన్ తెలిపారు. ద్వైపాక్షిక చర్చలకు అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఉందని అన్నారు. అయితే, కశ్మీరీల కోసం విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగిస్తామని, దౌత్యపరంగా పోరాడుతామని స్పష్టం చేసారు.
కశ్మీర్ విభజనలో ఎంఎస్డీదే కీలక పాత్ర..! క్రియాశీల పాత్ర పోషించిన మోదీ త్రయం..!!
ఎంఎస్డీ అంటే టక్కున గుర్తు వచ్చేది భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ..భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా, ఆపై కీపర్ గా, బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా ధోనీకి ఉన్న పేరు, గుర్తింపు, అభిమాన గణం గురించి అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు కశ్మీర్ విభజనలో ఎంఎస్డీదే కీలక పాత్ర అని ఎంఎస్డీ పేరిట ఓ ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. అది ధోనీకి సంబంధించినది మాత్రం కాదు. ఇక్కడ 'ఎంఎస్డీలో' ఎం అంటే 'మోదీ, ఎస్ అంటే షా, డీ అంటే అజిత్ ధోవల్'... వీరి ముగ్గురి పేరిట నెటిజన్లు ఓ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. దశాబ్దాల నుంచి అమలులో ఉన్న ఆర్టికల్ 370 రద్దుపై ప్రతి ఒక్కరూ మోదీ సర్కారును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసాధ్యమనుకున్న దాన్ని వీరు ముగ్గురూ కలిసి సుసాధ్యం చేశారని, ఇక జమ్మూ కశ్మీర్ లో శాంతిని నెలకొల్పి, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిని సారించాలని సలహా ఇస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఉన్న అందాల కశ్మీరం మరోసారి రావాలని కోరుకుంటున్నారు.
370 ఆర్టికల్ కథ ముగిసింది..! ఇక దేశమంతా స్వేచ్చా వాయువులే నన్న కిషన్ రెడ్డి..!!
జమ్మూ కశ్మీర్ లో 370 ఆర్టికల్ కధ నేటితో ముగిసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించిన తరువాత ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభలో 61 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటువేయగా, అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేసి ప్రజల అభిప్రాయాన్ని దేశానికి తెలియజేసారు. ప్రతి భారతీయుడికి నిజమైన దీపావళి నేడు. చరిత్రలో ఆగస్టు 5వ తేదీ చిరస్థాయిగా నిలిచిపోతుంది, ఇందులో నేను భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందన్నారు.
మోదీ సాహసోపేత ప్రధాని..! ప్రశంసలు కురిపించిన హోం శాఖ సహాయ మంత్రి..!!
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు సంబురాలు చేసుకొంటున్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ దేశ అభివృద్ధిలో నేటినుంచి భాగస్వామ్యం అయింది. ఆ రాష్ట్రానికి చెందిన ప్రతిపౌరుడు రిజర్వేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నీ పొందుతాడు. ఎప్పటినుంచో కలలు కన్న ఒక దేశం, ఒక జెండా, ఒక విధానం నేడు అమలులోకి వచ్చింది. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి, మద్దతు ఇచ్చిన పార్టీలకు, ప్రజప్రతినిధులకు,అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు. 370 రద్దు ఎవరికి వ్యతిరేకం కాదు,అనుమానాలు అవసరం లేదు. ఆగస్టు 15న దేశంలో ప్రతి గ్రామంలో ఎలా పంద్రాగస్టు వేడుకలు జరుపుకొంటామో, జమ్మూ, కశ్మీర్ లోని ప్రతి గ్రామంలో మువ్వన్నెల జండా రెపరెపలు చూడవచ్చు అని కిషన్ రెడ్డి అన్నారు.