కుక్క తోక వంకర తీరుగా పాకిస్థాన్.. పంజాబ్ లో హై అలర్ట్
ఢిల్లీ : కుక్క తోక వంకర అన్నట్లుగా పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. భారత్ దాడితో అడుగు వెనక్కి వేయాల్సింది పోయి మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం తెల్లవారుజామున భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన కొద్దిసేపటికే నిఘా డ్రోన్ ను మన భూభాగంలోకి పంపింది. ఆ కుట్రను తిప్పికొట్టిన వాయుసేన.. డ్రోన్ ను కూల్చివేసింది. అదలావుంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది పాకిస్థాన్ సైన్యం. సరిహద్దుల్లో మంగళవారం సాయంత్రం నుంచి కాల్పులు జరుపుతోంది.
సరిహద్దు గ్రామాలే లక్ష్యం
కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలను కవ్విస్తోంది పాక్ సైన్యం. నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం సాయంత్రం నుంచి కాల్పులు జరుపుతోంది. సరిహద్దు గ్రామల్లోని సామాన్యులే లక్ష్యంగా విధ్వంసానికి పాల్పడుతోంది. భారీ ఆయుధాలతో పాటు మోర్టార్లను ఉపయోగిస్తూ బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల ఇళ్లు ధ్వంసం కాగా.. ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు. అయితే మరోసారి ఎదురుదాడికి దిగిన భారత సైన్యం.. పాకిస్థాన్ కు చెందిన 5 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ సైనికులు పెద్దసంఖ్యలో చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.
6 జిల్లాల్లో హై అలర్ట్
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ప్రతీకారేచ్ఛకు దిగింది. పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అక్కడి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. శాంతి, భద్రతల విషయంపై క్షుణ్ణంగా చర్చించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించారు ఉన్నతాధికారులు.
కేంద్రానికి పూర్తి మద్దతు
అమృత్ సర్, పఠాన్ కోట్, ఫిరోజ్పూర్, తరణ్ సాహెబ్, గురుదాస్పూర్, ఫాజిల్కా జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజల భద్రత కోసం అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫిరోజ్పూర్, పఠాన్కోట్ సరిహద్దు ప్రాంతాల్లోని రోడ్డు మార్గంలో బుధవారం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పర్యటించనున్నారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో కేంద్రానికి పూర్తి మద్దతుగా ఉంటామని ఆయన ప్రకటించారు. కేంద్ర హోంశాఖతో పాటు రక్షణశాఖతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నట్లు తెలిపారు.