కశ్మీర్ ఇష్యూలో పాకిస్థాన్కు ఎదురుదెబ్బ.. అంతర్జాతీయంగా సపోర్ట్ లేదంటున్న ఖురేషీ..!
ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు.. జమ్ముకశ్మీర్ విభజన నిర్ణయంపై భారత ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఆ క్రమంలో దాయాది పాకిస్థాన్ కుట్రలకు బ్రేకులు పడుతున్నాయి. కశ్మీర్ ఇష్యూను ముందేసుకుని రెచ్చిపోదామనుకున్న పాకిస్థాన్ ఆటలకు కళ్లెం పడుతోంది. జమ్ముకశ్మీర్ విభజనపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రష్యా, చైనా కూడా సమర్థించడంతో ఇరకాటంలో పడింది. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే ఛాన్స్ లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ పరోక్షంగా అంగీకరించడం చర్చానీయాంశమైంది.
ఇండియాను ఇరికించాలని కుతంత్రం.. చివరకు ఇలా..!
కశ్మీర్ విభజన వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ప్రపంచస్థాయిలో ఇండియాను తప్పుపట్టాలని చూస్తున్న దాయాది పాకిస్థాన్ కుట్రలు సాగడం లేదు. ఆ క్రమంలో పాకిస్థాన్కు షాక్ మీద షాక్ తగులుతోంది. కశ్మీర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ మధ్యవర్తిత్వం కోసం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది పాకిస్థాన్. ఆ క్రమంలో పాకిస్థాన్ పాచికలు పారలేదు. అంతేకాదు పాక్ అభ్యర్థనను ఐక్యరాజ సమితి తోసిపుచ్చడం గమనార్హం.
ఆ స్థాయిలో మద్దతు కష్టమే.. ఖురేషీ పరోక్ష వ్యాఖ్యలు
కశ్మీర్ ఇష్యూలో ఇండియా తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయ సమాజం మద్దతు పలుకుతోంది. ఆ క్రమంలో అంతర్జాతీయ సమాజం ఎట్టిపరిస్థితుల్లో తమకు అండగా నిలిచే ఛాన్స్ లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ. కశ్మీర్ అంశాన్ని అవకాశంగా మలచుకుని భారత్ను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్న పాకిస్థాన్ వైఖరి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కశ్మీర్ విషయంలో పాక్ ప్రభుత్వం ఏం చేయలేకపోతుందని అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తీరును కూడా ఆయన తప్పు పట్టారు. భారతదేశంపై పాకిస్థాన్ చేయాలనుకుంటున్న ఫిర్యాదులను స్వీకరించడానికి ఐక్యరాజ సమితి రెడీగా లేదని వ్యాఖ్యానించారు.
భారత్ను ఇరుకున పెట్టలేం.. సపోర్ట్ లేదుగా..!
భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా ఈజీ అని.. అదే క్రమంలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం కూడా సులువని చెప్పుకొచ్చారు ఖురేషీ. అయితే భారత్ను ఇరుకున పెట్టేలా ముందుకు సాగడం మాత్రం కష్టమైన పనంటూ మనసులోని మాట బయటపెట్టారు. పాకిస్థాన్ ఫిర్యాదును స్వీకరించడానికి ఐక్యరాజ్య సమితి సిద్ధంగా లేదన్నారు. ఐరాసలో శాశ్వత సభ్య దేశాల్లో ఎవరో ఒకరు అడ్డుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. రష్యాతో పాటు చైనా కూడా భారత్ తీసుకున్న నిర్ణయంపై తాము ఏమీ చేయలేమని స్పష్టం చేసిన క్రమంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపికయింది.
తోక ముడిచినట్లేనా..?
జమ్ముకశ్మీర్ విభజనపై భారత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ ప్రపంచ స్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది పాకిస్థాన్. అయితే అంతర్జాతీయ సమాజం నుంచి పాక్ ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. ఆ క్రమంలో డిఫెన్స్లో పడ్డ పాక్ ప్రభుత్వం.. ఏమి చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా ఖురేషీ చేసిన పరోక్ష వ్యాఖ్యలతో పాక్ తోక ముడిచినట్లేనన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రష్యా, చైనా సపోర్ట్ భారత్కే.. పాక్ ఒంటరేనా?
పాకిస్థాన్కు శాశ్వత మిత్రపక్ష దేశమైన చైనా కూడా కశ్మీర్ విభజన విషయంలో ఆచితూచి స్పందిస్తోంది. భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో కశ్మీర్ విషయంలో తాము చేయబోయే పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ చైనాను కోరింది పాకిస్థాన్. అయితే దాయాది దేశం ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. అంతేకాదు ఇండియా, పాకిస్థాన్ రెండు కూడా తమకు మిత్రదేశాలని స్పష్టం చేసింది. సిమ్లా ఒప్పందం, ఐరాస తీర్మానం ఆధారంగా.. కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించడం కొసమెరుపు.