ముచ్చెమటలు... గజగజ వణికిపోయారు.. అభినందన్ వర్థమాన్ విడుదల వేళ ఇదీ పాకిస్తాన్ పరిస్థితి...
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారేచ్చతో రగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించేలా ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. దీంతో భారత్పై పాక్ మరోసారి దాడికి యత్నించింది. పాక్ యుద్ద విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకు రాగా... భారత ఎయిర్ఫోర్స్ అప్రమత్తంగా వ్యవహరించి వాటిని తరిమికొట్టింది. ఈ క్రమంలో భారత్కు చెందిన మిగ్-21 విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడంతో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను అక్కడి బలగాలకు చిక్కారు. ఆ తర్వాత అభినందన్ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పాక్ ఎంతలా తర్జనభర్జన పడిందో... ఎంతలా భయపడిపోయిందో... పాకిస్తాన్ విపక్ష పార్టీ ముస్లిం లీగ్-నవాజ్ అగ్ర నేత సాధిక్ తాజాగా పార్లమెంట్ సాక్షిగా వివరించారు.
Recommended Video
మరో ఉగ్ర కుట్ర భగ్నం.... కశ్మీర్లో మరో పుల్వామా తరహా దాడికి స్కెచ్... 52కిలోల పేలుడు పదార్థాలు..
ఆ సమావేశంలో ఏం జరిగింది...
'భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కాక... విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఖురేషీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి పాకిస్తాన్లోని అందరు అగ్ర నేతలను ఆహ్వానించారు. ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా కూడా హాజరైన ఆ సమావేశానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం హాజరుకాలేదు. అప్పటికే కమర్ బజ్వా కాళ్లు వణుకుతున్నాయి. నుదుటిపై చెమటలు పట్టాయి. కాసేపటికి మహమ్మద్ ఖురేషీలోనూ వణుకు మొదలైంది. అభినందన్ను వదిలేయాల్సిందే.. లేదంటే భారత్ పాకిస్తాన్పై రాత్రి 9గంటలకు దాడి చేసేందుకు సిద్దమవుతోందని ఖురేషీ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభినందన్ను భారత్కు పంపించాల్సిందేనని బతిమాలారు.' అని ముస్లిం లీగ్-నవాజ్ అగ్ర నేత సాధిక్ వెల్లడించారు.
తోసిపుచ్చిన మంత్రి...
అభినందన్ అంశంతో సహా ఇప్పటివరకూ అన్ని అంశాల్లో ప్రభుత్వానికి మద్దతునిస్తూ వచ్చామని... ఇక నుంచి తమ మద్దతు ఉండదని సాదిక్ పార్లమెంటులో పేర్కొన్నట్లుగా దున్యా న్యూస్ రిపోర్ట్ చేసింది. మరోవైపు సాధిక్ చేసిన ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ ఫెడరల్ మినిస్టర్ ఫవాద్ చౌదరి ఖండించడం గమనార్హం. సాధిక్ వ్యాఖ్యల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. పైగా పుల్వామా ఘటనను పాకిస్తాన్ సాధించిన విజయంగా అభివర్ణించారు. తద్వారా ఆ దాడి చేసింది తామేనని పరోక్షంగా అంగీకరించారు.
పుల్వామా దాడి నేపథ్యంలో..
పుల్వామా దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు 40 మంది భారత సీఆర్పీఎఫ్ బలగాలను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత భారత్ పాక్పై ప్రతీకారంతో ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. దీంతో పాక్ బెంబేలెత్తిపోయింది. కానీ ఆ మరుసటిరోజే.. పాకిస్తాన్ ప్రతి దాడికి దిగింది. భారత భూభాగంలోకి పాక్ యుద్ద విమానాలు చొచ్చుకొచ్చాయి. దీంతో భారత వైమానిక దళం వాటిని తిప్పికొట్టగా... ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ భూభాగంలో పడిపోయి అక్కడి ఆర్మీకి చిక్కారు. ఆ తర్వాత పాకిస్తాన్ అభినందన్ను సురక్షితంగా భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే.