ఉగ్రవాదాన్ని ఆపేవరకు.. పాక్తో మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..! చైనాకు స్పష్టం చేసిన మోడీ
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కో ఆపరేటివ్ సమ్మిట్కు హాజరైన ప్రధాని నరేంద్రమోడీ.. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్ చైనాల మధ్య వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారంపై భేటీలో చర్చించినట్లు మోడీ ప్రకటించారు. చర్చల సందర్భంగా పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందని జిన్పింగ్ దృష్టికి తెచ్చిన ప్రధాని టెర్రరిస్టులపై పాక్ కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని అన్నారు.
ఉగ్రవాదం ఆపితేనే..
జిన్పింగ్తో భేటీలో పుల్వామా ఘటన, తదనంతర పరిణామాలు, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని మోడీ ఆయన దృష్టికి తెచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపితేనే పాక్తో శాంతి చర్చల ప్రక్రియ ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదరహిత వాతావరణాన్ని సృష్టించినప్పుడే శాంతి చర్చల పునరుద్ధరణ సాధ్యమవుతుందన్న మోడీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాకిస్థాన్ అలాంటి వాతావరణం ఏర్పరుస్తున్నట్లు కనిపించడంలేదని అభిప్రాయపడ్డారు.
త్వరలో భారత్కు జిన్పింగ్
ఇదిలా ఉంటే చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ త్వరలో భారత్కు రానున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానాన్ని అంగీకరించిన ఆయన.. ఈ ఏడాదిలోనే భారత్ పర్యటనకు వచ్చేందుకు ఓకే చెప్పారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ధ్రువీకరించింది. గతేడాది ఏప్రిల్లో చైనాలోని ఉహాన్లో మోడీ, జిన్పింగ్లు అనధికారికంగా సమావేశమయ్యారు.
మధ్యవర్తిత్వ చర్చలకు సిద్ధం
మరోవైపు భారత్ పాక్ మధ్య సంబంధాలు ప్రస్తుతం పతనావస్థలో ఉన్నాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. శాంతి చర్చల కోసం తాను రెండుసార్లు మోడీకి లేఖ రాశానని, అయితే భారత్ మాత్రం అందుకు సుముఖంగా లేదని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా చర్చలు జరిగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, బిష్కెక్ సమ్మిట్ ఇందుకు ఓ మంచి అవకాశమని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.