మా ముస్లీంల గురించి మీ బాధ అవసరం లేదు: పాక్కు రాజ్నాథ్
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్ అల్లర్ల పైన రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం నాడు స్పందించారు. కాశ్మీర్ అల్లర్ల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించారు. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అది తమ బాధ్యత అన్నారు.
భారత దేశంలో ఉన్న ముస్లీంల గురించి పాకిస్తాన్ బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మా ముస్లీంల గురించి మాట్లాడే హక్కు పాక్కు లేదని కుండబద్దలు కొట్టారు. విభజించి పాలించి సిద్ధాంతం తమది కాదన్నారు. ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, అల్లర్లతో అట్టుడుకుతోన్న కశ్మీర్ అంశంపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. పీడీపీ-బీజేపీ ప్రభుత్వంపై విశ్వాసం లేదని, ప్రభుత్వ తీరే అందుకు కారణమన్నారు.
అక్కడి పౌరులనూ మిలిటెంట్లలా చూస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చూస్తూ వారిని అణచివేసే ప్రయత్నాలు చేయొద్దన్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు అని కూడా చూడకుండా జవాన్లు వారిపై తూటాలతో విరుచుకుపడుతున్నారన్నారు.
కాశ్మీర్ అంశంపై తాను ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మిలిటెన్సీని అంతమొందించడంలో తమ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని, అయితే, పౌరుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుకి మాత్రం తమ మద్దతు ఉండబోదన్నారు.