ఉగ్రవాదులు రూటు మార్చారా: సౌదీ తరహాలో డ్రోన్లతో దాడులు? ఇంటెలిజెన్స్ ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాన కేంద్రంగా తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోన్న ఉగ్రవాదులు రూటు మార్చారు. డ్రోన్ల సహకారంతో మారణ హోమాన్ని సృష్టించే సాంకేతిక నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్నారు. కొద్దిరోజుల కిందటే సౌదీ అరేబియాలోని చమురు నిక్షేపాలపై దాడులు చేసిన తరహాలోనే డ్రోన్లతో బాంబులు, ఇతర పేలుడు వస్తువులను జార విడటం ద్వారా పెద్ద ఎత్తున ప్రాణాలను హరించే దిశగా కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు వెల్లడించారు. పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగం వైపు నుంచి గ్రెనేడ్లు, ఏకే-47 వంటి మారణాయుధాలను భారత భూభాగంపైకి డ్రోన్ల సహకారంతోనే జారవిడిచినట్లు నిర్ధారించిన నేపథ్యంలో.. దాడులు చేయడానికి ఉగ్రవాదులు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
సరిహద్దుల్లో పాక్ సరికొత్త కుట్ర: డ్రోన్ల ద్వారా మారణాయుధాలు తరలింపు: 26/11 తరహా దాడులు!
డ్రోన్లతో దేశ రాజధానికి ముప్పే
చైనాలో తయారు చేసినట్లుగా భావిస్తోన్న కొన్ని రకాల డ్రోన్లకు భారీ సామాగ్రిని సైతం అవలీలగా మోయగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. అలాంటి డ్రోన్ల ద్వారానే పంజాబ్ సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాదులు మారణాయుధాలను జార విడిచినట్లు తేలింది. పంజాబ్ సరిహద్దు గ్రామాల వరకూ బాంబులు, గ్రెనేడ్లను తరలించగలిగిన ఉగ్రవాదులు.. వాటినే దేశ రాజధాని వరకూ తీసుకుని రాలేకపోవచ్చనే విషయంపై గ్యారంటీ లేదు.
ఒక్కసారి ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకున్న తరువాత.. దాన్ని మరింత మెరుగుపరిచి, దేశంలో ఎక్కడైనా, ఎలాంటి ప్రాంతంలోనైనా డ్రోన్లతో దాడులకు తెగబడే అవకాశాలను కొట్టి పారేయలేమని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. సౌదీ అరేబియాలోని కొన్ని చమురు క్షేత్రాలపై కొద్దిరోజుల కిందటే దాడులు చేయడానికి ఇలాంటి డ్రోన్లనే వినియోగించారు. అదే తరహా విధానాన్ని భారత్ పై ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తుండ వచ్చని, పంజాబ్ ఉదంతమే దీనికి నిదర్శమని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో కీలక సమాచారం..
జైషె మహమ్మద్, లష్కరే తొయిబా వంటి సంస్థల సానుభూతిపరులుగా గుర్తింపు పొందిన కొంతమందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొంత కీలక సమాచారాన్ని రాబట్టారు. తమ అదుపులో ఉన్న అనుమానితుల వాట్సప్, ఇమెయిల్, ఫేస్ బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను జల్లెడ పట్టారు. అందులో ఉంచిన కీలక సమాచారాన్ని డీకోడ్ చేశారు.
ఈ సందర్భంగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. డ్రోన్ల ద్వారా నరమేథాన్ని సృష్టించడానికి గల అవకాశాలపై సమగ్ర సమాచారం వాటిల్లో పొందుపరిచినట్లు తేలిందని సమాచారం. సుమారు 10 కేజీల వరకు బరువును మోయగల డ్రోన్లను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేశారని, దీనికి సంబంధించిన వివరాలు కూడా ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై అందుబాటులో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.
డ్రోన్లు కనిపిస్తే..సమాచారం ఇవ్వాలంటూ
డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా అందిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. దేశ రాజధాని గగనతలంపై డ్రోన్లు తిరుగాడుతున్నట్లు కనిపిస్తే.. వెంటనే ఆ సమాచారాన్ని తమకు తెలియజేయాలంటూ హెచ్చరికలను జారీ చేశారు. ఆ డ్రోన్ యజమాని వివరాలు తెలియకపోతే.. వెంటనే దాన్ని నేలకూలుస్తామని అన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలపై నిఘా పెట్టారు. జనసమ్మర్థంతో ఉండే మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రాంతాలపై డ్రోన్లను ఎగుర వేయడాన్ని త్వరలో నిషేధించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
కిటకిటలాడే ప్రాంతాలపై సుమారు 10 కేజీల మేర పేలుడు పదార్థాలను జార విడిచిన తరువాత చోటు చేసుకునే పరిణామాలను ఊహించలేమని, భారీగా ప్రాణనష్టం సంభవించే అవకాశాలు లేకపోలేదని పోలీసులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
పైలెట్లనూ అప్రమత్తం చేసిన పోలీసులు..
డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ కార్యాలయాన్ని సైతం అప్రమత్తం చేశారు. విమానాశ్రయాల భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్ బలగాలతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. డ్రోన్లు కనిపించిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం ఇవ్వాలని పైలెట్లను సైతం అప్రమత్తం చేసినట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డీసీపీ సంజయ్ భాటియా వెల్లడించారు.
నో ఫ్లైజోన్ గా గుర్తించిన ప్రదేశాల్లో డ్రోన్లు ఎగురుతున్నట్లు గుర్తిస్తే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాటిని కూల్చేస్తామని అన్నారు. ప్రస్తుతం డ్రోన్లు గానీ ఇతర ప్రైవేటు వస్తువులను గానీ విమానాశ్రయానికి 1500 మీటర్ల వరకు ఎగుర వేయడంపై నిషేధం కొనసాగుతోందని అన్నారు. డ్రోన్లను నిర్వీర్యం చేసే సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉన్నప్పటికీ.. దాన్ని అమలు చేయడం వల్ల విమానానికి, ఏటీసీకి మధ్య ఉండే సమాచార వ్యవస్థ, రాడార్ స్థితిగతులను కూడా ప్రభావితం చేస్తుందని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డ్రోనంస్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ లివింగ్ స్టన్ తెలిపారు.