భారత్ పై ఉగ్రదాడులకు ప్లాన్: కస్టడీలోని మసూద్ అజార్ను రహస్యంగా విడుదల చేసిన పాక్
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోతున్న పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డ జైషే మహద్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ను తమ కస్టడీ నుంచి రహస్యంగా విడుదల చేసింది. మే 2019లో ఐక్యరాజ్యసమితి మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంది. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యూహాలు రచించాల్సిందిగా కోరుతూ పాక్ ప్రభుత్వం మసూద్ను విడిచిపెట్టినట్లుగా ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది.
ఈ మధ్యే హెచ్చరికలు జారీ చేసిన నేవీ చీఫ్
ఇప్పటికే జైషే మహ్మద్ సంస్థ సముద్రమార్గం ద్వారా దాడులు నిర్వహించేందుకు కొందరు ఉగ్రమూకలకు శిక్షణ ఇస్తున్నట్లు భారత నేవీ ఈ మధ్యే హెచ్చరికలు జారీ చేసింది. భారత నేవీ చాలా అలర్ట్గా ఉందని తీరప్రాంతాల్లో గస్తీని మరింత బలోపేతం చేసినట్లు నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ చెప్పారు. సముద్రమార్గం నుంచి ఏ ఉగ్రవాది చొరబడలేరని చెప్పారు. ఉగ్రవాదులు సముద్ర మార్గం నుంచి దాడులకు ప్రయత్నిస్తే వాటిని సమర్థవంతంగా తిప్పికొడతామన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు.
అజార్ను కాపాడే ప్రయత్నం చేసిన డ్రాగన్ కంట్రీ
ఇదిలా ఉంటే మసూద్ అజార్పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా పాక్ చిరకాల మిత్రదేశం చైనా చాలా ప్రయత్నాలే చేసింది. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా... మసూద్ అజార్పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయకుండా ఆ మేరకు సాంకేతిక కారణాలు చూపుతూ కాపాడే ప్రయత్నం చేసింది. అజార్పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయాలంటూ ఐక్యరాజ్యసమితి ఇతర శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్లు డిమాండ్ చేశాయి. అయితే చైనా అడ్డుపడినప్పటికీ ఐక్యరాజ్యసమితి అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదులు జాబితాలో చేర్చింది.
పుల్వామాతో సహా పలు ఉగ్రదాడుల వెనక మసూద్ హస్తం
భారత్లో పలు ఉగ్రదాడులు నిర్వహించిన మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడంతో భారత్ ప్రయత్నాలు ఫలించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడులు చేయించి భారత జవాన్లను బలిగొన్న ఘటన వెనక మసూద్ అజార్ హస్తం ఉంది.ఇక అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్ పేరును జాబితాలో చేర్చడంతో అతని ఆస్తులపై నిషేధం, లావాదేవీలపై నిషేధం, విదేశాలకు వెళ్లడంపై నిషేధం అమల్లోకి వచ్చింది.
కొద్దిరోజుల క్రితం భారత ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టంకు సవరణలు చేసింది. ఇందులో భాగంగా కేంద్రహోంశాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో మసూద్ అజార్, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ముంబై దాడుల ప్రధాన సూత్రధారి జకీర్ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, 1993 ముంబై పేలుళ్లు ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంలను ఉగ్రవాదులుగా పేర్కొంది.